రాజ్యసభ ఉపఎన్నికల్లో ఆ కేంద్ర మంత్రులే అభ్యర్థులు.. ప్రకటించిన బీజేపీ
రాజ్యసభలో ఖాళీగా ఉన్న సీట్లకు ఎన్నికల కమిషన్ అక్టోబర్ 4న ఉపఎన్నికలు జరుపనున్నట్టు ప్రకటించింది. ఈ ఎన్నికల కోసం బీజేపీ ఇద్దరు కేంద్రమంత్రుల పేర్లను ప్రకటించింది. అసోం నుంచి సర్బానంద సోనోవాల్, మధ్యప్రదేశ్ నుంచి ఎల్ మురుగన్లను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటిచింది. వీరిరువురినీ ఇటీవలే ప్రధానమంత్రి కేంద్ర క్యాబినెట్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: రాజ్యసభ ఉపఎన్నికల్లో బీజేపీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కేంద్రమంత్రులు సర్బానంద సోనోవాల్, ఎల్ మురుగన్లను రాజ్యసభ ఉపఎన్నికల్లో తమ అభ్యర్థులుగా ఖరారు చేసింది. వీరు అసోం, మధ్యప్రదేశ్లకు చెందిన స్థానాల నుంచి పోటీ చేయనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జులై 7న కేంద్రమంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది సీనియర్లను పక్కకు తప్పించి చాలా మంది కొత్తవారికి చోటు కల్పించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే అసోం నుంచి సర్బనంద సోనోవాల్, మధ్యప్రదేశ్ నుంచి డాక్టర్ ఎల్ మురుగన్లకు క్యాబినెట్లోకి తీసుకున్నారు. అయితే, వీరిరువురూ పార్లమెంటు సభ్యులు కాదు.
పశ్చిమ బెంగాల్, అసోం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల నుంచి రాజ్యసభలో ఒక్కోసీటు, తమిళనాడు నుంచి రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ సీట్లకు అక్టోబర్ 4న ఉపఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్ నుంచి మానస్ రంజన్ భూనియా, అసోం నుంచి బిశ్వజిత్ దైమరీ, తమిళనాడు నుంచి కేపీ మునుసామి, ఆర్ వైతిలింగం, మధ్యప్రదేవ్ నుంచి థావర్చంద్ గెహ్లాట్లు రాజీనామా చేశారు. మే 16న కరోనా అనంతర సమస్యలతో బాధపడుతూ ఎంపీ రాజీవ్ సతావ్ మరణించడంతో మధ్యప్రదేశ్ సీటు ఖాళీ అయింది.