ఒడిశా హోటల్లో ఇద్దరు రష్యన్లు మృతి.. పుతిన్ను విమర్శించే చట్టసభ్యుడి మరణంపై అనుమానాలు
ఒడిశాలోని రాయగడ జిల్లాలో ఓ హోటల్లో ఇద్దరు రష్యన్ పౌరులు మరణించారు. అందులో ఒకరు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమర్శకుడైన చట్టసభ్యుడు కావడం గమనార్హం. ఇద్దరూ రెండు రోజుల తేడాతో అదే హోటల్లో మరణించారు.
భువనేశ్వర్: ఒడిశాలో రాయగడలోని ఓ హోటల్లో రష్యా చట్టసభ్యుడు మరణించడం కలకలం రేపుతున్నది. ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమర్శకుడు కావడంతో ఇది హిట్ జాబ్ అయ్యుంటుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఆంటోవ్ పార్టీ కొలీగ్ రెండు రోజుల ముందు అదే హోటల్లో మరణించాడు. వారం వ్యవధిలోనే ఇది రెండో రష్యా చట్టసభ్యుడి మరణం కావడం గమనార్హం.
రష్యా లా మేకర్ పావెల్ ఆంటోవ్ తన 65వ జన్మదిన వేడుకల కోసం ఒడిశాకు వచ్చారు. ఆయనతోపాటు అతని ఫ్రెండ్ వ్లాదిమిర్ బిడెనోవ్, మరో ఇద్దరు ఒడిశాకు వచ్చారు. డేరింగ్బడిలో పర్యాటక ప్రాంతాలను సందర్శించి రాయగడ జిల్లాలోని ఓ హోటల్లో బసకు దిగారు. ఈ నలుగురితో పాటు రష్యన్ టూరిస్టు గైడ్ జితేంద్ర సింగ్ కూడా దిగారు. డిసెంబర్ 21న వీరు ఆ హోటల్కు వచ్చారు. డిసెంబర్ 22 ఉదయం వ్లాదిమిర్ బిడెనోవ్ హోటల్లో మరణించాడు. చుట్టూ వైన్ బాటిల్స్ ఉండగా మధ్యలో అతడు విగతజీవై కనిపించాడు. అతడిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. కానీ, అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు తెలిపారు. అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు ఎస్పీ వివేకానంద శర్మ చెప్పారు. కాగా, డిసెంబర్ 25వ తేదీన పుతిన్ విమర్శకుడైన చట్టసభ్యుడు పావెల్ ఆంటోవ్ మరణించాడు.
Also Read: యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో క్లారిటీ ఇచ్చిన పుతిన్
పావెల్ ఇటీవలే ఉక్రెయిన్ పై రష్యా దాడులను విమర్శిస్తూ ఓ మెస్సేజీ పంపాడు. ఆ తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఆయన ఒడిశాకు వచ్చాక తన మిత్రుడు వ్లాదిమిర్ బీ మరణించాడు. రెండు రోజుల తర్వాత అతను కూడా తాను ఉంటున్న హోటల్ మూడో ఫ్లోర్ నుంచి కింద పడి మరణించాడు. రక్తపు మడుగులో పావెల్ ఆంటోవ్ ప్రాణాలు వదిలాడు. తన మిత్రుడు వ్లాదిమిర్ మరణంతో కలత చెంది మనస్తాపంతో పావెల్ ఆంటోల్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఎస్పీ తెలిపారు. కుటుంబ సభ్యుల అనుమతితో ఆంటోవ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించామని వివరించారు.
ఈ ఘటనలపై భారత్లోని రష్యన్ ఎంబసీ స్పందించింది. ఒడిశాలో జరిగిన విషాదం తమకు తెలిసిందని, తమ ఇద్దరు పౌరులు మరణించారని వివరించింది. అందులో లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు పావెల్ ఆంటోవ్ అని పేర్కొంది. తాము వారి కుటుంబ సభ్యులు, స్థానిక అధికారు లకు అందుబాటులో ఉంటున్నామని ఎన్డీటీవీకి వివరించింది. ఇప్పటి వరకు ఈ విషాదాల్లో నేరపూరిత కోణమేమీ ఉన్నట్టు పోలీసులు గుర్తించ లేదని తెలిపింది.