బుద్గాంలో ఎన్కౌంటర్.. ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా సిబ్బంది..
జమ్మూ కాశ్మీర్లోని బుద్గాం జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టింది.
జమ్మూ కాశ్మీర్లోని బుద్గాం జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టింది. బుద్గాం జిల్లాలోని కోర్టు కాంప్లెక్స్ సమీపంలో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి నిర్దిష్ట సమాచారంతో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు.
‘‘బుద్గామ్ గుండా ఉగ్రవాదుల కదలిక గురించి నిర్దిష్ట సమాచారంతో ఆర్మీ, పోలీసుల ఉమ్మడిగా కోర్టు సముదాయం సమీపంలో ఒక అనుమానిత వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది కూడా ప్రతీకారంగా కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు’’ పోలీసు ప్రతినిధి తెలిపారు. ఇక, హతమైన ఉగ్రవాదులు నిషేధిత సంస్థ లష్కరే తోయిబాతో సంబంధం కలిగి ఉన్నారని కశ్మీర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.
ఎన్కౌంటర్లో హతమైన ఇద్దరు ఉగ్రవాదులను పుల్వామా జిల్లాకు చెందిన అర్బాజ్ మీర్, షాహిద్ షేక్లుగా గుర్తించారు. సమీపంలోని మాగం ప్రాంతంలో గత వారం జరిగిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నుంచి ఉగ్రవాదులిద్దరూ తప్పించుకున్నారని విజయ్ కుమార్ చెప్పారు. ఇక, భద్రతా సిబ్బంది ఘటన స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.