ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం ఇద్దరు జవాన్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. సుక్మా, బీజాపూర్‌ జిల్లాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు జవాన్లు తమ సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు

ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం ఇద్దరు జవాన్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. సుక్మా, బీజాపూర్‌ జిల్లాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు జవాన్లు తమ సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఛత్తీస్‌గఢ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ 4వ బెటాలియన్‌లో విధులు నిర్వహస్తున్న దినేశ్ వర్మ (35) అనే జవాన్ సుక్మా జిల్లాలోని పుష్పల్‌లో తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

సెలవుపై ఇంటికి వెళ్లి తిరిగి ఈ నెల 26న విధుల్లో చేరిన దినేశ్‌ వర్మ మానసిక ఆందోళన కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

అలాగే బీజాపూర్‌ జిల్లాలోని పామేడులో వినోద్‌ పోర్సే (29) అనే జవాన్‌ వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

కాగా, శనివారం సుక్మా జిల్లాలోని బుర్కపాల్‌, చింతకుప్ప అటవీ ప్రాంతాల మధ్య ఉన్న తాడుమెట్ల గ్రామం వద్ద మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలింది.

ఈ దుర్ఘటనలో 206వ బెటాలియన్ కోబ్రా దళానికి చెందిన అసిస్టెంట్‌ కమాండెంట్‌ నితిన్‌ బలేరావ్‌ సహా 9 మంది కమాండోలు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు. వారిలో చికిత్స పొందుతూ అసిస్టెంట్ కమాండెంట్‌ నితిన్‌ బలేరావ్‌ మృతి చెందారు.