దారుణం.. మైనర్ బాలిక పై అఘాయిత్యం, అనంతరం..
గురువారం బాలిక మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టంలో బాలిక అత్యాచారానికి గురై హత్యకు గురైందని నిర్ధారించారు.
మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి.. అనంతరం అతి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రం పుదుకోట జిల్లా అరన్ తాంగి సమీపంలో చోటుచేసుకుంది. కాగా.. బాలిక హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... అవుండయార్కోయిల్ తాలూకాకు చెందిన ఏడేళ్ల బాలిక మంగళవారం నుంచి కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం సాయంత్రం గాయాలతో పడి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించి, పోస్టుమార్టం నిమిత్తం పుదుకోట ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. సంఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ అరుణ్ శక్తికుమార్ పరిశీలించి, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
అరన్తాంగి డీఎస్పీ బాలమురగన్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక పోలీస్ బృందం.. బాలిక పక్క ఇంట్లో ఉంటున్న పూల వ్యాపారి రాజేష్(27)ను అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా, గురువారం బాలిక మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టంలో బాలిక అత్యాచారానికి గురై హత్యకు గురైందని నిర్ధారించారు.
ఈ వ్యవహారంలో బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు రాజేష్ అంగీకరించాడు. దీంతో ఈ ఘటనలో పరారీలో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా ఈ ఘటనను జాతీయ పిల్లల హక్కుల భద్రత సంఘం సమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.
బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన వారికి చట్టపరంగా శిక్ష పడేలా చర్యలు చేపడతామని సీఎం ఎడప్పాడి పళనిస్వామి తెలిపారు. ఈ మేరకు సీఎం తన ట్విట్టర్లో.. ఈ ఘటన తన మనసును ఎంతో బాధించిందని.. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు.