జమ్మూ ఎయిర్ ఫోర్స్ బేస్లో పేలుడు: డ్రోన్లతో దాడి
జమ్మూ లో ఆదివారం నాడు ఉదయం ఎయిర్పోర్టులో పేలుడు చోటు చేసుకొంది. రెండు డ్రోన్లను ఉపయోగించి పేలుడుకు పాల్పడ్డారు ఉగ్రవాదులు.
జమ్మూ:జమ్మూ లో ఆదివారం నాడు ఉదయం ఎయిర్పోర్టులో పేలుడు చోటు చేసుకొంది. రెండు డ్రోన్లను ఉపయోగించి పేలుడుకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ఆర్మీకి చెందిన ఎయిర్బేస్ ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. ఎయిర్ బేస్లో డ్రోన్ల ద్వారా పేలుడు పదార్ధాలను ఉంచి పేల్చారు. ఈ పేలుళ్లలో ఏ విమానానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అయితే ఇద్దరు సిబ్బంది మాత్రం స్వల్పంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ఈ పేలుడు కారణంగా ఓ భవనం పైకప్పు స్వల్పంగా దెబ్బతింది. మరొకటి బహిరంగ ప్రదేశంలో పేలిందని అధికారులు ప్రకటించారు. తమ పరికరాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఐఎఎఫ్ ఆదివారం నాడు ప్రకటించింది. ఈ విషయమై దర్యాప్తు నిర్వహిస్తున్నారు.ఆదివారం నాడు తెల్లవారుజామున 1:40 గంటలకు పేలుడు సంబవించిందని ఐఎఎఫ్ తెలిపింది. ఈ పేలుడు ఘటన విషయం తెలిసిన వెంటనే జమ్మూ పోలీసులు ఇతర దర్యాప్తు అధికారులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తును ప్రారంభించారు.
ఈ ఘటన తర్వాత ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. ఇందులో ఒక్కరు లష్కరే తోయిబా ఉగ్రవాదిగా అనుమానిస్తున్నారు. నిందితుల నుండి 4.7 కిలోల పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకొన్నారు. అయితే ఈ దాడితో వీరికి సంబంధం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.