ట్యాక్స్ ఏజెంట్ను అపహరించి రూ. 1.5 లక్షలు వసూలు చేసిన ఇద్దరు ఢిల్లీ పోలీసులు
ఢిల్లీలో ఓ ట్యాక్స్ ఏజెంట్ను ఏకంగా పోలీసులు కిడ్నాప్ చేసి ఎక్స్టార్షన్ చేశారు. రూ. 1.5 లక్షలు వసూలు చేసి వదిలిపెట్టారు. బాధితుడు పోలీసు కేసు పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు పోలీసులను ఈ కేసులో అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: ఓ సేల్స్ ట్యాక్స్ ఏజెంట్ను కిడ్నాప్ చేసి.. డబ్బులు వసూలు చేసిన కేసులో ఇద్దరు ఢిల్లీ పోలీసులు అరెస్టయ్యారు. రూ. 1.5 లక్షలు వసూలు చేసిన కేసులో వీరిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఆయనను కిడ్నాప్ చేసి తప్పుడు కేసులో ఇరికిస్తామని, వెంటనే తమకు ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తంగా రూ. 1.5 లక్షలు తీసుకుని బాధితుడిని వదిలిపెట్టారు. ఆ బాధితుడు పోలీసు కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదైంది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసులో సేల్స్ ట్యాక్స్ ఏజెంట్గా పని చేస్తున్న ఓ వ్యక్తిని ఢిల్లీలో షాదారాలోని జీటీబీ ఎంక్లేవ్లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఆయనను అక్టోబర్ 11వ తేదీన ఆఫీసు నుంచి జీటీబీ ఎంక్లేవ్కు తిరిగి వస్తుండగా షాదారా ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఓ వైట్ కలర్ కారు ఓవర్ టేక్ చేసి అడ్డుగా వచ్చింది. బాధితుడి ఫిర్యాదు ప్రకారం, అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి తాను కారు దిగగానే తనపై దాడి చేయడం మొదలు పెట్టారు.
ఆ తర్వాత తనను కారు వెనుక సీటులో కూర్చోబెట్టారు. అందులో ఒక పోలీసు తాను క్రైం బ్రాంచీ నుంచి అని చెప్పినట్టు పేర్కొన్నారు. మరొకరు పిస్టల్ తీసి తన ఛాతిలో గురి పెట్టి తన వెంట ఉన్న రూ. 35 వేలు దోచుకున్నారని వివరించారు. తమకు రూ. 5 లక్షలు ఇస్తే వదిలిపెడతామని, లేదంటే లాకప్లో వేస్తామని బెదిరించారు. ఆ తర్వాత షాదారా జిల్లాలోని స్పెషల్ స్టాఫ్ ఆఫీసుకు తీసుకెళ్లారని, అక్కడ ఒక ఆఫీసర్ దగ్గరకు తీసుకెళ్లి మళ్లీ కారులో కూర్చోబెట్టారని వివరించారు. ఆ అధికారి తనను లాకప్ చేయాలని సూచించారని వారు చెప్పినట్టు పేర్కొన్నారు.
Also Read: జైలు అధికారికే కుచ్చుటోపీ పెట్టిన సైబర్ నేరగాళ్లు.. నగ్నవీడియోలు ఉన్నాయని సీబీఐ పేరుతో మోసం..
ఆ తర్వాత మెడికల్ చెకప్ కోసమని జీటీబీ హాస్పిటల్ తెచ్చారని, అప్పుడు మరోసారి తనను బెదిరించి భయపెట్టారని వివరించారు. అప్పుడు బాధితుడు వారిని తన ఇంటికి తీసుకెళ్లి రూ. 50 వేలు ఇచ్చాడు. తన దగ్గర ఇంకా డబ్బు లేనందున మరో మిత్రుడిని అప్పుగా అడిగి రూ. 70 వేలను నిందితుల్లో ఒకడి భార్య ఖాతాకు పంపించానని బాధితుడు తెలిపారు. ఆ తర్వాత బాధితుడిని వదిలిపెట్టినట్టు వివరించారు.
జీటీబీ పోలీసు స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు సీమాపురి పీఎస్కు చెందిన ఇద్దరు కానిస్టేబుల్లు సందీప్, రాబిన్లను మరో వ్యక్తి వాహిద్ను కూడా అరెస్టు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తి ఢిల్లీ పోలీసు అమిత్, సీమాపూరిలో రౌడీగా ఉన్న గౌరవ్లు ఇద్దరు పరారీలో ఉన్నారు.