రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా అన్లాక్
వారం రోజుల తర్వాత మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ రాహుల్ గాంధీపై వేసిన వేటును ఎత్తేసింది. రాహుల్ ట్విట్టర్ ఖాతా తాజాగా పునరుద్ధరించింది. రాహుల్ సహా ఇతర కాంగ్రెస్ నేతల ఖాతాలు అందుబాటులోకి వచ్చాయని పార్టీ నేతలు చెప్పారు.
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఖాతాపై కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలికంగా నిలిపేసిన ఆయన ట్విట్టర్ అకౌంట్ను వారం రోజుల తర్వాత మళ్లీ పునరుద్ధరించింది. కాంగ్రెస్ నేతలందరి ఖాతాలను అన్లాక్ చేసిందని పార్టీ సోషల్ మీడియా అకౌంట్స్ ఇన్చార్జ్ రోహన్ గుప్తా వెల్లడించారు. మళ్లీ అందరి ఖాతాలను పునరుద్ధరించడానికి ప్రత్యేకంగా కారణాలేవీ పేర్కొనలేదని వివరించారు. ట్విట్టర్ ఖాతాలు అన్లాక్ అయిన తర్వాత ‘సత్యమేవ జయతే’ అని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హోల్డింగ్ పోస్టు చేసింది.
ఇటీవలే వాయవ్య ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలికపై లైంగికదాడి, హత్యకు సంబంధించిన వివరాలను రాహుల్ గాంధీ పోస్టు చేశారు. బాధిత కుటుంబీకుల ఫొటోలను ట్వీట్ చేయడానికి మైక్రోబ్లాగింగ్ సంస్థ ఆయన ఖాతాను నిలిపేసింది. లైంగికదాడి బాధితురాలి కుటుంబ సభ్యుల ఫొటోలు పోస్టుచేయడం తమ నిబంధనల ఉల్లంఘనేనని పేర్కొంటూ ట్విట్టర్ వేటువేసింది.
వారం రోజులుగా రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా మనుగడలో లేదు. తాజాగా, మళ్లీ ట్విట్టర్ పునరుద్ధరించింది. అయితే, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన ట్విట్టర్పై విరుచుకుపడ్డారు. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఓ వీడియోలో మాట్లాడుతూ ట్విట్టర్ తటస్థవైఖరిని కలిగి లేదని, ప్రభుత్వపక్షం వహిస్తున్నదని ఆరోపించారు. ట్విట్టర్ పక్షపాత సామాజిక వేదిక అని మండిపడ్డారు. అధికారంలోని ప్రభుత్వం చెప్పుచేతల్లో నడుస్తున్నదని అన్నారు. ట్విట్టర్ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నదని విమర్శించారు. తన ఖాతాను నిలిపేయడం దేశ ప్రజాస్వామిక నిర్మాణంపై దాడిగా పేర్కొన్నారు. ట్విట్టర్ ప్రమాదకర ఆట ఆడుతున్నదని చెప్పారు. లక్షలాది మంది ఖాతాదారులు తమ అభిప్రాయాన్ని వెల్లడించే హక్కును కాలరాస్తున్నదని విమర్శించారు.