ట్విట్టర్ ఇంటర్మీడియరీ హోదాను కోల్పోయిందంటున్న కేంద్రం, సాధ్యమా..?
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్ ను పాటించకపోవడంపై ట్విట్టర్ ఇండియాలో మధ్యవర్తి హోదాను కోల్పోయిందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్ ను పాటించకపోవడంపై ట్విట్టర్ ఇండియాలో మధ్యవర్తి హోదాను కోల్పోయిందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.కొత్త ఐటీ నిబంధనలను పాటించనిక్షణంలో ట్విట్టర్ ఇండియాలో మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయిందని అధికారవర్గాలు తెలిపాయి. ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించిన విషయానికి వస్తే ట్విట్టర్ ఆ కంటెంట్ కు బాధ్యత వహిస్తోందని అధికారవర్గాలు తెలిపాయి. ట్విట్టర్ కమ్యూనికేషన్ అస్పష్టంగా ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయినట్టు ప్రకటించే అధికారం ప్రభుత్వానికి లేదని, ఇందుకు సంబంధించి ఐటి రూల్స్ లో ఏక్కడా పేర్కొనలేదని ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ తెలిపింది. ట్విట్టర్ ద్వారా భారత ఐటి రూల్స్ ను ప్రస్తావిస్తూ ట్విట్టర్ ఇంటర్మీడియరీ హోదాను కోల్పోయిందా, లేదా అని కోర్టు నిర్ణయిస్తుంది తప్ప, ఆ అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పింది. ట్విట్టర్ ఇంటర్మీడియరీ హోదాను కోల్పోయిందని చెబుతూ ప్రభుత్వం ఇప్పటివరకు జీవోనుగానీ, సర్క్యూలర్ ని గానీ విడుదల చేయలేదని పేర్కొంది.
also read:ట్విట్టర్కి షాక్: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు
తాత్కాలిక చీప్ కంప్లయిన్స్ ఆఫీసర్ ను నియమించామని ఆ వ్యక్తి వివరాలను త్వరలోనే ఐటీ మంత్రిత్వశాఖకు వివరిస్తామని ట్విట్టర్ ప్రకటించిన మరునాడే ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఏడాది మే 26 నుండి ఇండియాలో కొత్త ఐటీ రూల్స్ అమల్లోకి వచ్చాయి. అయితే ఈ రూల్స్ కు అనుగుణంగా ట్విట్టర్ కీలక సిబ్బందిని నియమించలేదు. ట్విట్టర్ కు ఇచ్చిన చివరి అవకాశం తర్వాత ప్రభుత్వం ఈ చర్యలు తీసుకొంది.కంప్లయిన్స్ ఆఫీసర్ నియామకం దాదాపుగా ఖరారు చేసే దశలో ఉందని వారం లోపు అదనపు వివరాలను సమర్పిస్తామని భారత ప్రభుత్వానికి గత వారంలో ట్విట్టర్ హామీ ఇచ్చింది. ఈ విషయమై ఐటీ మంత్రిత్వశాఖకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నామని ట్విట్టర్ అధికార ప్రతినిధి తెలిపారు.
రైతుల నిరసన సందర్భంగా చేసిన ట్వీట్లతో పాటు బీజేపీకి చెందిన నేతల పోస్టుల విషయంలో ట్విట్టర్ తీరుపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై కేంద్రం ట్విట్టర్ కు గతంలోనే సీరియస్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.కంప్లయెన్స్ ఆఫీసర్ , నోడల్ ఆఫీసర్, ఫిర్యాదు అధికారిలను నియమించడం తప్పనిసరి. కొత్త ఐటీ రూల్స్ ప్రకారంగా ఈ అధికారులు ఇండియాలో నివాసం ఉండేవారై ఉండాలి.ట్విట్టర్ కు దేశంలో 1.75 మంది యూజర్లున్నారు. ప్రపంచంలోని పలు దేశాల కంటే ఇండియా తమకు అతి ముఖ్యమైన మార్కెట్ అని ట్విట్టర్ పేర్కొంది.