టీవీ నటిపై గదిలో పలుమార్లు అత్యాచారం
ముంబైలో తాను 2014లో చదువుకుంటున్నప్పుడు నిందితుడు పరిచయమయ్యాడని, సోషల్ మీడియా ద్వారా ఇటీవల మళ్లీ తనను కలిశాడని నటి తన ఫిర్యాదులో చెప్పింది.
జైపూర్: తనపై తన ప్రియుడే అత్యాచారం చేశాడని ముంబైకి చెందిన పాతికేళ్ల వయస్సు గల మోడల్, బుల్లితెర నటి (25) ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని ఆమె రాజస్థాన్లోని అల్వార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ముంబైలో తాను 2014లో చదువుకుంటున్నప్పుడు నిందితుడు పరిచయమయ్యాడని, సోషల్ మీడియా ద్వారా ఇటీవల మళ్లీ తనను కలిశాడని నటి తన ఫిర్యాదులో చెప్పింది. ఇద్దరి మధ్య స్నేహం పెరిగిన తర్వాత ఆగస్టులో తామిద్దరం కలుసుకోవాలని నిర్ణయించుకున్నామని, అతడిని కలిసేందుకు ముంబై నుంచి ఢిల్లీ వెళ్లానని ఆమె వివరించింది.
ఫిర్యాదులోని వివరాల ప్రకారం.... ప్రేయసిని నిందితుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. తల్లిదండ్రులకు, స్నేహితులకు పరిచయం చేశాడు. ఆ తర్వాత ఇద్దరు ఈ నెల 4న రాజస్థాన్లోని నీమ్రాణాకు వెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత నిందితుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఈ ఘటనపై నీమ్రాణా పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ సంజయ్ పునియా స్పందించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన బాధితురాలు తన ప్రియుడిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లినట్టు ఆయన తెలిపారు. ఢిల్లీలో ఓ కారును అద్దెకు తీసుకున్న నిందితుడు, ప్రియురాలు, తన స్నేహితులతో కలిసి నిమ్రాణా చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడ అందరూ కలిసి ఓ హోటల్లో గదులు అద్దెకు తీసుకున్నారు.
నటి, ప్రియుడు ప్రత్యేకంగా ఓ గదిలో ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ రాత్రి ఆమెపై పలుమార్లు రేప్ చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.