భారత్‌లోనూ భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్‌లోని ఎర్త్ సైన్స్ విభాగానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్త ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. హిమాలయన్ జోన్ అత్యంత దుర్బలమైనదని చెప్పారు 

టర్కీ, సిరియా తరహాలో భారతదేశంలో కూడా భారీ భూకంపం వచ్చే ప్రమాదం ఉందా ? అని ప్రశ్నిస్తే.. అవుననే సమాధానమిస్తున్నారు ఉత్తరప్రదేశ్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ-కాన్పూర్‌) శాస్త్రవేత్తలు. ఐఐటీ కాన్పూర్‌లోని ఎర్త్ సైన్స్ విభాగానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జావేద్ మాలిక్ ప్రకారం.. టర్కీ, సిరియాలో మాదిరిగానే.. భారతదేశంలో కూడా బలమైన భూకంపాల ప్రకంపనలు సంభవించవచ్చని హెచ్చరిస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రొఫెసర్ జావేద్ మాలిక్ .. చాలా కాలంగా మనదేశంలో సంభవించిన భూకంపాలపై పరిశోధనలు చేస్తున్నారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో 7.5 తీవ్రతతో భూకంపాలు సంభవించవచ్చని ప్రొఫెసర్ హెచ్చరిస్తున్నారు. వచ్చే ఒకటి, రెండు దశాబ్దాల్లో లేదా ఒకటి రెండేళ్లలో ఎప్పుడైనా అసాధారణ రీతిలో భూకంపం సంభవించవచ్చని తెలిపారు. హిమాలయ మాసిఫ్ లేదా అండమాన్ మరియు నికోబార్ దీవులలో భూకంప కేంద్రం ఏర్పడే అవకాశం ఉందనీ , అందుకే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కోన్నారు. ఇంత బలమైన భూకంపం దృష్ట్యా, ప్రతి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ సూచించారు.

ప్రొఫెసర్ మాలిక్ భూకంప ప్రభావిత ప్రాంతాలైన కచ్, అండమాన్ , ఉత్తరాఖండ్‌లో చాలా కాలంగా భూమి యొక్క మార్పులను అధ్యయనం చేస్తున్నారు. భూ ప్రకంపనల దృష్ట్యా దేశంలో ఐదు జోన్లను ఏర్పాటు చేశామన్నారు. 

జోన్-5లోని ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైనవి. ఈ జోన్ లో కచ్, అండమాన్ మరియు నికోబార్ , హిమాలయ ప్రాంతాలు ఉన్నాయి. జోన్ 4లో బహ్రైచ్, లఖింపూర్, పిలిభిత్, ఘజియాబాద్, రూర్కీ, నైనిటాల్ సహా టెరాయ్ ప్రాంతాలు ఉన్నాయి. అలాగే.. జోన్-3లో కాన్పూర్, లక్నో, ప్రయాగ్‌రాజ్, వారణాసి, సోన్‌భద్ర మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

భూకంపానికి కారణమేంటీ? 

భూమి లోపల టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొనడం వల్ల భూకంపాలు సంభవిస్తాయని ప్రొఫెసర్ మాలిక్ వివరించారు. దీని వల్ల ఏర్పడే ఉద్రిక్తత శక్తి భూకంపానికి కారణమవుతుందనీ, శక్తి చాలా ఎక్కువగా ఉంటే.. బలమైన ప్రకంపనలు సంభవిస్తాయని తెలిపారు. టర్కీలో భూకంపం తీవ్రత 7.8గా ఉండగా, 2004లో భారత్‌లో సంభవించిన భూకంపం తీవ్రత 9.1గా నమోదైంది.