ఛాన్స్ ఇస్తానని నమ్మించి అత్యాచారం.. టీసిరీస్ హెడ్ పై ఆరోపణలు
తన ఫోటో, వీడియో వైరల్ చేస్తామని నిందితుడు బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది. ముంబైలోని అంధేరికి చెందిన డిఎన్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్ ప్రొడక్షన్ టీ హౌస్ టీ సిరీస్ హెడ్ భూషణ్ కుమార్ వివాదంలో ఇరుక్కున్నారు. మూడేళ్లుగా ఆయన తనపై అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ మహిళ ఆయనపై ఆరోపణలు చేసింది.
తన ప్రాజెక్ట్ లో అవకాశం కల్పిస్తానంటూ నమ్మించి.. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు మహిళ పేర్కొనడం గమనార్హం. 2017 నుండి 2020 ఆగస్టు వరకు భూషణ్ కుమార్ తనను దాదాపు మూడేళ్ళకు పైగా వేధింపులకు గురిచేశాడని బాధితురాలు ఆరోపించింది. ఆమెను వేర్వేరు ప్రదేశాలకు తీసుకెళ్లి వేధింపులకు గురిచేసినట్లు మహిళ ఆరోపించింది . తన ఫోటో, వీడియో వైరల్ చేస్తామని నిందితుడు బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది. ముంబైలోని అంధేరికి చెందిన డిఎన్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
గతంలో మీటూ ఉద్యమం ద్వారా మోడల్ మెరీనా కున్వర్ కూడా భూషణ్ కుమార్ శారీరక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. మెరీనా కున్వర్ ఓ టీవి ఛానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో భూషన్ ఒక రోజు తనను కలవడానికి ప్రయత్నించారని చెప్పారు. తనతో తప్పుడు పనులు చేయడానికి ప్రయత్నించాడని పేర్కొంది. తన కాల్ వివరాలను మీకు సాక్ష్యంగా చూపిస్తానని తెలిపింది. కాగా... తనపై వచ్చిన ఆరోపణలను భూషణ్ కుమార్ ఖండించారు. పబ్లిసిటీ కోసమే తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని ప్రకటించారు.