త్రిపుర అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. తొలి రౌండ్లలో బీజేపీ అభ్యర్ధులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సీపీఎం, కాంగ్రెస్ అభ్యర్ధులు వెనుకంజలో ఉన్నారు.
న్యూఢిల్లీ: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. త్రిపుర అసెంబ్లీలోని 60 స్థానాల్లో తొలి రౌండ్లలో బీజేపీ అభ్యర్ధులు 37 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్,సీపీఎం కూటమి ప్రస్తుతం 16 స్థానాల్లో ఆదిక్యంలో నిలిచింది .
గురువారం నాడు ఉదయం త్రిపుర అసెంబ్లీ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. త్రిపురతో పాటు నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో కూడా ఓట్ల లెక్కింపు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 16న త్రిపుర అసెంబ్లీకి పోలింగ్ నిర్వహించారు. ఒకే విడతలో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది. త్రిపుర రాష్ట్రంలోని 36 అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. దీంతో 36 ఏళ్ల సీపీఎం పాలనకు త్రిపురలో బీజేపీ చెక్ పెట్టింది. అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ కంటే ఒక్క శాతం ఓట్లు మాత్రమే సీపీఎంకు వచ్చాయి. కానీ ఆ పార్టీ కేవలం 16 స్థానాల్లో మాత్రమే విజయంసాధించింది.
గత ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా పోటీ చేసింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పీపీఎం కూటమిగా పోటీ చేశాయి. రెండు పార్టీల మధ్య పొత్తు కారణంగా ఈ దఫా సీపీఎం 47 స్థానాల్లో పోటీ చేస్తుండగా , కాంగ్రెస్ 13 స్థానాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
