గంజాయితో పట్టుబడిన త్రిపుర బీజేపీ ఉపాధ్యక్షుడి వాహనం
త్రిపుర: గంజాయితో పట్టుబడిన త్రిపుర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర కమిటీ ఉపాధ్యాక్షుని వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అగర్తల: గంజాయితో పట్టుబడిన త్రిపుర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర కమిటీ ఉపాధ్యాక్షుని వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణ జరుగుతున్నదని తెలిపారు. వివరాల్లోకెళ్తే.. కమల్పూర్కు వెళుతుండగా ఆదివారం రాత్రి ధలై జిల్లాలో అతని వాహనం నుండి భారీ గంజాయిని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో త్రిపుర పోలీసులు సోమవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు మంగళ్ దెబ్బర్మపై విచారణ ప్రారంభించారు. అతని వాహనాన్ని అదుపులోకి తీసుకున్నప్పటికీ రాత్రి తర్వాత విడుదల చేశారు.
గంజాయి రవాణ విషయంలో అతను తన ప్రమేయం, సరుకు గురించిన అవగాహనను నిరాకరించినప్పటికీ, స్థానిక ప్రజలు అతన్ని పోలీసు స్టేషన్లో నిర్బంధించమని పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, డెబ్బర్మ ఈ కేసులో తన ప్రమేయాన్ని ఖండించారు. కావాలనే కొందరు ఇలా ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. "కొన్ని స్వార్థ ప్రయోజనాల సమూహాలు అతని రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నాయి" అని అన్నారు. అలాగే, తన వాహనం వెనుక ఉన్న గంజాయి సరుకు గురించి తనకు గానీ, తన కారు డ్రైవర్కు గానీ తెలియదని అన్నారు. తాము లేని సమయంలో ఎవరో గంజాయి ప్యాకెట్ను అతని కారు వెనుక పెట్టారని పేర్కొన్నారు. దీని గురించి పోలీసులకు సమాచారం అందిందన్నారు.
కాగా, బీజేపీ నేతపై ప్రజలు నుంచి, ఇతర రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నిష్పక్షపాతంగా విచారణకు తాము ఎల్లప్పుడూ అనుకూలంగా ఉంటామని, మంగళ్ దోషిగా తేలితే ఖచ్చితంగా చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని ఇక్కడి బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ ఘటనను పార్టీ పరువు తీసేందుకు జరిగిన కుట్రగా బీజేపీ భావించింది. స్థానిక గ్రామస్తులు వాహనంలో సుమారు 400 కిలోల గంజాయిని లోడ్ చేసినట్లు గుర్తించి, కారుపై దాడి చేయవలసిందిగా పోలీసులను బలవంతం చేసినట్లు వర్గాలు తెలిపాయి. పోలీసుల దాడి సమయంలో మంగళ్ దెబ్బర్మ తన కారులో ఉన్నాడు. అయితే అతను వెంటనే స్పాట్ నుండి తప్పించుకున్నాడు. అనంతరం పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఖోవాయ్ నుంచి కమల్పూర్ రోడ్డులో గంజాయి రవాణాలో పోలీసులు కూడా స్మగ్లర్లకు సహకరిస్తున్నారని, కొన్ని వీఐపీ వాహనాలు, నాయకులు, అధికారుల కార్లను నిషిద్ధ వస్తువుల రవాణాకు ఉపయోగిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.
ఇదిలావుండగా, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపిస్తూ త్రిపురలో రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిన ఒక రోజు తర్వాత, అధికార బీజేపీ సోమవారం కాంగ్రెస్ రాష్ట్ర ప్రతిష్టను కించపరిచిందని పేర్కొంది. అగర్తలాలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన త్రిపుర సమాచార, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుశాంత చౌదరి, “అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రతిపక్షాలు మురికి నీళ్లలో చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి” అని అన్నారు. త్రిపురలో బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం తుంగలో తొక్కిందంటూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) త్రిపుర ఇన్చార్జి జనరల్ సెక్రటరీ డాక్టర్ అజోయ్ కుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మన్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ గూండాయిజం కారణంగా త్రిపురలో ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు న్యూఢిల్లీలో పేర్కొన్నారు.