త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు.. రథయాత్ర చేపట్టనున్న బీజేపీ
Tripura: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రథయాత్ర చేపట్టనుంది. 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీకి వచ్చే ఏడాది (2023) ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి.
Tripura Assembly Elections: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి. అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సైతం మరొసారి అధికారం దక్కించుకోవడానికి ఎన్నికల గెలుపు వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగానే అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఒక నెల ముందు రాష్ట్రంలో ప్రజల దగ్గరకు వెళ్లడానికి రథయాత్రను చేపట్టనున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపాయి.
వివరాల్లోకెళ్తే.. త్రిపురలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జనవరి మొదటి నుండి రాష్ట్రవ్యాప్తంగా 'రథయాత్ర' నిర్వహించనుందని, వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాషాయ పార్టీ సిద్ధమవుతుందని పార్టీ నాయకుడు సోమవారం వెల్లడించారు. బీజేపీ రాష్ట్రవ్యాప్త రథయాత్ర సన్నాహాలను పర్యవేక్షించేందుకు సమాచార, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుశాంత చౌదరి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
60 మంది సభ్యుల త్రిపుర అసెంబ్లీకి వచ్చే ఏడాది (2023) ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఉత్తర త్రిపుర జిల్లా నుంచి ఒక యాత్ర, దక్షిణ త్రిపుర జిల్లా నుంచి మరో యాత్ర బయలుదేరుతుందని బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ సునీత్ సర్కార్ తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజల ఆశీస్సులు పొందడమే యాత్ర లక్ష్యమని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సుబర్త చక్రవర్తి తెలిపారు. "ప్రజలు తమ ప్రాథమిక అవసరాలను తీర్చిన పార్టీకి సంఘీభావం తెలిపేందుకు 'రథయాత్ర'లో చేరతారని మేము నమ్ముతున్నాము" అని ఆయన అన్నారు.
ఎన్నికల ముందు ఈశాన్య రాష్ట్రంలో తొలిసారిగా రాజకీయ పార్టీ ఇలాంటి యాత్రను నిర్వహించనుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో, బీజేపీ అనేక రోడ్ షోలు నిర్వహించింది, వాటికి అనేక మంది కేంద్ర మంత్రులు నాయకత్వం వహించారు. ఈ రోడ్ షోలు ఎన్నిల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు రాబట్టడంలో సాయపడ్డాయి. ఇదిలా ఉండగా, కాషాయ పార్టీ మెగా ఔట్రీచ్ ప్రోగ్రాం 'ప్రతి ఘరే శుషణ్' ఆదివారం ముగిసింది. ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఆదివారం సాయంత్రం పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను సమీక్షించారు.
2023లో రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నాహాలను పరిశీలించేందుకు త్రిపురకు బీజేపీ ఉన్నత స్థాయి బృందాన్ని పంపిందని సంబంధిత వర్గాలు సైతం వెల్లడించాయి. బీజేపీ బృందానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నేతృత్వం వహిస్తున్నారు. త్రిపుర బీజేపీ ఇన్ఛార్జ్ మహేశ్ శర్మ, మహేంద్ర సింగ్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా బృందంలోని ఇతర సభ్యులుగా ఉన్నారు. దీంతో పాటు ఈ సమావేశానికి పలువురు సీనియర్ బీజేపీ నాయకులు సైతం హాజరయ్యారు. ఆదివారం త్రిపురకు చేరుకున్న బీజేపీ బృందం రెండు రోజుల పాటు రాష్ట్రంలో క్యాంపు నిర్వహించనుంది. త్రిపురలో ఉన్న సమయంలో పార్టీ రాష్ట్ర నేతలతో ఉన్నత స్థాయి బృందం సభ్యులు చర్చలు జరుపుతారు. ఎన్నికల పరిస్థితులపై అన్ని అంశాలను చర్చించనున్నట్టు తెలిపారు.