గోవా అసెంబ్లీ ఎన్నికలకు భారీగా ఖర్చు చేసిన తృణమూల్, బీజేపీ
Election expenditure: గోవా ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ ₹ 47 కోట్లను ఖర్చు చేసిందని ఎన్నికల కమీషన్ కు సమర్పించిన ఎన్నికల వ్యయ నివేదకలో పేర్కొంది. ఎన్నికల వ్యయ వివరాలను ఆయా రాజకీయ పార్టీలు ఇటీవల ఎన్నికల సంఘానికి సమర్పించాయి.
Goa assembly elections: రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం చేసే ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే.. ఇటీవలి కాలంలో ముగిసిన పలు రాష్ట్రాల ఎన్నికల ఖర్చుల గణాంకాలు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయి. గోవా ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ ₹ 47 కోట్లను ఖర్చు చేసిందని ఎన్నికల కమీషన్ కు సమర్పించిన ఎన్నికల వ్యయ నివేదకలో పేర్కొంది. ఎన్నికల వ్యయ వివరాలను ఆయా రాజకీయ పార్టీలు ఇటీవల ఎన్నికల సంఘానికి సమర్పించాయి. ఇక బీజేపీ సైతం భారీగానే ఖర్చు చేసింది.
వివరాల్లోకెళ్తే.. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు భారీ ప్రయత్నాలే చేశాయి. ఈ ఎన్నికల ప్రచారానికి భారీగా ఖర్చులు చేయడానికి సైతం వెనకడుగు వేయలేదు. ఎన్నికల ఖర్చు విషయానికి వస్తే, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ₹ 47.54 కోట్లును గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఖర్చు చేసిందని ఈసీకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. అలాగే, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నేతృత్వంలో గోవాలో అధికారాన్ని నిలుపుకున్న బీజేపీ రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు కోసం ₹ 17.75 కోట్లకు పైగా ఖర్చు చేసింది.
ఎన్నికల బరిలో నిలిచిన ఇతర పార్టీల ఖర్చులు గమనిస్తే.. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గోవాలో ఎన్నికల కోసం దాదాపు ₹ 3.5 కోట్లు ఖర్చు చేసింది. అలాగే, గోవాలో బీజేపీని అధికారం నుంచి దించాలని భావించిన కాంగ్రెస్, ఆ రాష్ట్ర ఎన్నికల కోసం సుమారు ₹ 12 కోట్లు ఖర్చు చేసింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం తాను నిలబెట్టిన 11 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి ₹ 25 లక్షలు ఇచ్చింది. అంతేకాకుండా పార్టీ కేంద్ర నిధి నుండి ప్రచారానికి ఖర్చు చేసింది. గోవా ఎన్నికలలో 10 మంది అభ్యర్థులను నిలబెట్టిన శివసేన ఎన్నికల ఖర్చు కోసం దాదాపు ₹ 92 లక్షలు ఖర్చు చేసింది. విస్తరణపై దృష్టి సారించిన తృణమూల్ కాంగ్రెస్ గోవాలో ఎన్నికల్లో పోటీకి దిగింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో పార్టీకి పట్టు సాధించే ప్రయత్నంలో కీలక పాత్ర పోషించారు.
గోవా అసెంబ్లీ ఎన్నికలలో టీఎంసీ 23 మంది అభ్యర్థులను నిలబెట్టింది. అయితే వారిలో ఎవరూ కూడా విజయం సాధించలేకపోయారు. దాని మిత్రపక్షమైన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ 13 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి ఇద్దరిని గెలిపించగలిగింది. ఆప్ 39 మంది అభ్యర్థులను రంగంలోకి దించగా, రాష్ట్రంలో రెండు స్థానాల్లో విజయం సాధించి ఖాతా తెరవగలిగింది. గోవాలో జరిగిన ఎన్నికల పోరులో తృణమూల్ కాంగ్రెస్, ఆప్లు బీజేపీ వ్యతిరేక ఓట్లను విభజించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోసింది. 40 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీ 20 సీట్లు గెలుచుకుని ఇద్దరు ఎంజీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, ఈ నెల ప్రారంభంలో, ప్రతిపక్ష నాయకుడు మైఖేల్ లోబో, మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ సహా 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది బీజేపీలో చేరారు.