రాజీనామాలతో కుదేలు: ద్రోహి.. నెంబర్ టూపై కమల్ హాసన్ సీరియస్..!
కమల్ హాసన్ ఓటమి తర్వాత సమీక్ష చేసి రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని నేతలకు నూరిపోసినా ప్రయోజనం లేకుండా పోయింది. వరసపెట్టి రాజీనామాలు చేస్తుండటంతో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ మనుగడపై సందేహాలు నెలకొన్నాయి.
సినీ నటుడు కమల్ హాసన్కు ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ మక్కల్ నీది మయ్యమ్ ఘోర ఓటమి పాలైంది. అంతేకాదు ఆ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కూడా ఓడిపోయారు. దీంతో ఆ పార్టీ నేతల్లో నిరుత్సాహం నెలకొంది. ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
కాగా.. ఈ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత కమల్ హాసన్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఓటమి తర్వాత పదిమంది ముఖ్యనేతలు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ఉపాధ్యక్షుడితో సహా ముఖ్యనేతలు రాజీనామా చేయడంతో మక్కల్ నీది మయ్యమ్ లో కలకలం రేగింది.
కమల్ హాసన్ ఓటమి తర్వాత సమీక్ష చేసి రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని నేతలకు నూరిపోసినా ప్రయోజనం లేకుండా పోయింది. వరసపెట్టి రాజీనామాలు చేస్తుండటంతో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ మనుగడపై సందేహాలు నెలకొన్నాయి.
కాగా.. తమ పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్ కూడా రాజీనామా చేయడం పట్ల కమల్ హాసన్ అసహనం వ్యక్తం చేశారు. మహేంద్రన్.. పార్టీకి నెంబర్ 2 నేతగా గుర్తింపు పొందారు. అలాంటి ఆయన కూడా ఒక్క ఓటమితో పార్టీని వీడటం కమల్ ని తీవ్రంగా కలిచివేసింది. ఈ నేపథ్యంలో... ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
మహేంద్రన్ ని ద్రోహి అంటూ పేర్కొనడం గమనార్హం. కాగా.. కమల్ అలా పార్టీని వీడిన వారిని ద్రోహి అని పేర్కొనడం కూడా కలకలం రేపుతోంది. కాగా.. పార్టీలో సమానత్వం లేదని.. విభజించి పాలించు పద్దతిలో సాగుతోందని.. అందుకే తాను పార్టీని వీడుతున్నారని మహేంద్రన్ చెప్పడం గమనార్హం. తాను పార్టీలో గెలవాలని చాలా ప్రయత్నించానని.. కానీ ఫలితం దక్కలేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. ఓటమి తర్వాత కమల్ హాసన్ భవిష్యత్ కార్యచరణపై ఇంతవరకు స్పందించలేదు. తమిళనాడులో సినీ నటులకు రాజకీయ జీవితం ఉండదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. మరి దీనిపై కమల్ ఎలా స్పందిస్తాడో తెలియాల్సి ఉంది.