నెగిటివ్ రిపోర్ట్ అక్కర్లేదు, రైళ్ల నిలిపివేత లేదు.. అవన్నీ పుకార్లే: రైల్వే బోర్డ్ చైర్మన్
దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే మరోసారి లాక్డౌన్ అమలు చేసే ఉద్దేశ్యం లేదని ప్రధాని ప్రకటించినప్పటికీ.. వలస కూలీలు మాత్రం లాక్డౌన్ అనుమానాలతో సొంతవూళ్లకు ప్రయాణమవుతున్నారు.
దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే మరోసారి లాక్డౌన్ అమలు చేసే ఉద్దేశ్యం లేదని ప్రధాని ప్రకటించినప్పటికీ.. వలస కూలీలు మాత్రం లాక్డౌన్ అనుమానాలతో సొంతవూళ్లకు ప్రయాణమవుతున్నారు.
దీంతో చాలా రాష్ట్రాల్లో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. అలాగే త్వరలో రైళ్ల రాకపోకలను సైతం కేంద్రం నిలిపివేస్తుందంటూ పుకార్లు జోరందుకున్నాయి. ఈ పరిణామాలపై రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ స్పందించారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ రైలు సేవలను నిలిపివేసే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే డిమాండ్ను బట్టి రైళ్ల సంఖ్యను పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు.
Also Read:దేశంలో మళ్లీ లాక్డౌన్ వుండదు... కానీ : ప్రధాని మోడీ ప్రకటన
రైలు సేవలను తగ్గించడం లేదా నిలిపివేసే ప్రణాళికేదీ లేదని సునీత్ శర్మ పేర్కొన్నారు. ప్రతి యేటా వేసవిలో రైళ్లలో రద్దీ సహజమేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో రైళ్ల కొరత లేదని... ఒకవేళ ప్రయాణికుల రద్దీ పెరిగితే అందుకు అనుగుణంగా రైళ్ల సేవలను కూడా పెంచుతామని బోర్డ్ ఛైర్మన్ మీడియాకు వివరించారు.
అంతేగాకుండా, రైళ్లలో ప్రయాణించేందుకు కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరంటూ వస్తున్న వార్తలను సునీత్ కొట్టిపారేశారు. ప్రస్తుతానికి అలాంటి నిబంధనేమీ లేదని స్పష్టం చేశారు.