ముంబైని ముంచెత్తిన వర్షాలు, గోదావరి ఉగ్రరూపం: రెడ్ అలర్ట్
మహారాష్ట్రను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా ముంబైలో జనజీవనం స్థంభించిపోయింది. ఉత్తరాది రాష్ట్రాలకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ముంబై: ముంబైలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు ముంబైని వర్షాలు ముంచెత్తె అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముంబైతో పాటు ఉత్తరాది రాష్టాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
శనివారం రాత్రి కురిసిన వర్షాలకు లోకల్ రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను ఆసల్యంగా నడుపుతున్నారు. రాత్రంతా కురుస్తున్న వర్షాలకు పట్టాలపైకి నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కుర్లా, సియోన్, చూనాభతి ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది.
భారీ వర్షాల కారణంగా తిలక్ నగర్ స్టేషన్ పరిధిలో రోడ్ ఓవర్ బ్రిడ్జి కూలి రైలు పట్టాలపై పడింది.దీంతో పన్వేల్ వైపు వెళ్లే రైళ్లను మరో దారిలో మళ్లించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముంబైలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు.
ఠానేలో భారీ వర్షం వల్ల ఇల్లు కూలి ఒకరు మృతి చెందారు. నాసిక్ త్రయంబకేశ్వర్ ఆలయాన్ని గోదావరి నీరు ముంచెత్తింది. గోదావరి మహా ఉగ్రరూపంగా ప్రవహిస్తోంది.పాల్ఘర్, థానే, రాయ్గడ్, నాసిక్, సతారా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. మహారాష్ట్రతో పాటు ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. నాలుగు రోజులుగా ఉభయ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజుల్లో కూడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ ప్రకటించింది.
ఈ వర్షాల కారణంగా గోదావరి, కృష్ణా నదులకు వరద నీరు పోటెత్తింది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రెండు లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ నుండి జూరాలకు వచ్చి చేరుతోంది. జూరాల నుండి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.