కొండ చరియలు విరిగిపడి.. పట్టాలు తప్పిన రైలు..!
మార్గం మధ్యలో కొండ చరియలు విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
దేశ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాల కారణంగా.. పలు ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా.. వర్షం కారణంగా.. కొండ చరియలు విరిగిపడి.. రైలు పట్టాలు తప్పింది. ఈ సంఘటన గోవాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గోవాలో ప్రసిద్ధి చెందిన దూద్సాగర్ జలపాతం వద్ద మంగళూరు- ముంబై ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. మార్గం మధ్యలో కొండ చరియలు విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
కర్ణాటకలోని మంగళూరు నుంచి బయల్దేరిన రైలు.. సోనాలిమ్- దూద్ సాగర్ స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తూ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద స్థలంలో సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పట్టాలకు పక్కన ఉన్న కొండల నుంచి వరద రూపంలో మట్టి, రాళ్లు వచ్చి పట్టాలపై చేరడంతో వాటిని తొలగించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.