సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో మథుర రైల్వే స్టేషన్‌లో ఓ ప్యాసింజర్ రైలు ప్లాట్‌ఫామ్‌ మీదకు దూసుకొచ్చింది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లో మథుర రైల్వే స్టేషన్‌లో ఓ ప్యాసింజర్ రైలు ప్లాట్‌ఫామ్‌ మీదకు దూసుకొచ్చింది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. వివరాలు.. ఉత్తర రైల్వేకు చెందిన షకుర్‌బస్తీ-మథుర MEMU (04446).. రాత్రి 10:48 గంటలకు స్టేషన్‌కు చేరుకుంది. అయితే రైలు గమ్యస్థానం చేరుకున్నాక ప్రయాణికులు అందులో నుంచి దిగిపోయారు. అయితే ఐదు నిమిషాల తర్వాత రైలు.. ప్లాట్‌ఫామ్‌ మీదకు దూసుకొచ్చి.. ఓవర్‌హెడ్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఓవర్‌హెడ్ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. 

ఈ ఘటన జరిగిన సమయంలో రైలులో లోకో పైలట్లు, ప్రయాణికులు లేరని చెబుతున్నారు. మథుర రైల్వే స్టేషన్‌ అధికారులు మాట్లాడుతూ.. ప్రయాణికులంతా అప్పటికే రైలు దిగిపోయారని చెప్పారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఈ ఘటనతో అప్‌లైన్‌లో కొన్ని రైళ్ల రాకపోకలపై ప్రభావం పడిందని తెలిపారు.