దోమల నివారణ యంత్రంతో చెలారేగిన మంటలు.. ముగ్గురు మనుమరాలతో సహా నాన్నమ్మ మృతి..
తమిళనాడులోని చెన్నైలో ఘోర ప్రమాదం జరిగింది. దోమల నివారణ యంత్రం నుండి మంటలు చెలారేగడంతో ఒక వృద్దురాలు, ఆమె ముగ్గురు మనవరాలు ఊపిరాడక మరణించారు.
తమిళనాడులోని చెన్నైలో ఘోర ప్రమాదం జరిగింది. చెన్నైలోని మనాలిలో దోమల నివారణ యంత్రం నుండి మంటలు రావడంతో ఓ వృద్దురాలు, ఆమె ముగ్గురు మనవరాలు ఊపిరాడక మరణించారని పోలీసులు శనివారం తెలిపారు. ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లో స్పృహతప్పి పడి ఉన్న నలుగురిని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
వివరాల్లోకెళ్తే.. మనాలి సమీపంలోని మాథుర్ ప్రాంతంలో సెల్వి- వోడియార్ అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి సంధ్య,ప్రియా,రక్షిత అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. వావోడియార్ తల్లి సంతాన లక్ష్మి (65) కూడా వారితోనే నివసిస్తున్నారు. వడయార్ ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేస్తూ.. తన కుటుంబాని పోషిస్తున్నారు. కానీ, ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన చికిత్స నిమిత్తం కిల్పాక్కం కేఎంసీ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి సంతాన లక్ష్మినే వారి పిల్లల బాగోగులు చూసుకుంటుండగా, సెల్వి తన భర్తతో పాటు ఆసుపత్రిలో ఉంది.
ఈ తరుణంలో శుక్రవారం రాత్రి వోడియార్ కుమార్తెలు.. వారి నానమ్మతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నారు. ఈ సమయంలో దోమలను తరిమికొట్టేందుకు ఇంట్లో ఎలక్ట్రిక్ మస్కిటో రిపెల్లెంట్కు అమర్చారు. కానీ, ప్రమాదశాత్తు దాని నుంచి మంటలు చేలారేగడంతో పక్కనే ఉన్న అట్ట పెట్టెలకు మంటలు వ్యాపించాయి. ఆ తరువాత ఇల్లంతా పొగతో నిండిపోయింది. ఈ క్రమంలో ఉపిరి ఆడగకపోవడంతో వారందరూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు.
తెల్లవారుజామునా ఇంట్లోనుంచి పొగలు రావడంతో చూసిన స్థానికులు వెంటనే మాధవరం డెయిరీ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా ముగ్గురు బాలికలు, వృద్ధురాలు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వారిని ఆస్ప్రతికి తరలించగా.. అప్పటికే చనిపోయారని ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ఆస్పత్రికి తరలించి, ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై మాధవరం మిల్క్ కాలనీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దోమల మందుతో మంటలు చెలరేగడంతో ఓ వృద్ధురాలు, ముగ్గురు చిన్నారులు నిద్రలోనే మృతి చెందడం ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.