దేశవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా మరియు ఇతర సంస్థలు, దుకాణాలు, పరిశ్రమలు , వాణిజ్య సంస్థలు  మూసివేశారు. అయితే.. అత్యవసర సేవలకు మాత్రం అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నేడు భారత్ బంద్ (Bharat Bandh) కి పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు ఈ భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి సోమవారానికి (సెప్టెంబర్‌ 27) ఏడాదైన సందర్భంగా 40 రైతు సంఘాల ఉమ్మడి వేదికైన సంయుక్త కిసాన్‌ మోర్చా ఈ దేశవ్యాప్త నిరసన చేపట్టింది. 

ఈ మేరకు దేశవ్యాప్తంగా సన్నాహాలు చేసినట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా (Kishan Morcha) ప్రకటించింది. ఈ బంద్‌కు దేశంలోని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ జరగనుంది. రైతులు ప్రకటించిన బంద్‌కు కాంగ్రెస్ సహా వామపక్షాలు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. బంద్‌కు ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడెరేషన్‌ కూడా మద్దతు తెలిపింది. బంద్‌ దృష్ట్యా ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజధాని సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించారు.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా మరియు ఇతర సంస్థలు, దుకాణాలు, పరిశ్రమలు , వాణిజ్య సంస్థలు మూసివేశారు. అయితే.. అత్యవసర సేవలకు మాత్రం అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ భారత్ బంద్ లో భాగంగా రైతులు ఇప్పటికే.. పంజాబ్, హర్యానా మధ్య ఉన్న శంభు సరిహద్దును మొత్తం బ్లాక్ చేసేశారు. కాగా.. ఎలాంటి అవాంఛిత సంఘటనలు చోటుచేసుకోకుండా.. పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించడం గమనార్హం.

ఈ బంద్ కారణంగా.. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ మూత పడిపోయింది. ఆర్టీసీ బస్సులు సైతం ఎక్కడికక్కడ డిపోలీకే పరిమితమయ్యాయి. ఇతర వాహనాలకు కూడా ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదు. ప్రస్తుతానికైతే బంద్ ప్రశాంతంగానే జరుగుతోంది.