డ్రాగన్ కంపెనీలకు చెక్: కేంద్రమంత్రికి సీఏఐటీ లేఖ
భారత్- చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్లో చేపట్టే 5జీ నెట్ వర్క్ ప్రక్రియలో హువాయి, జడ్టీఈ కార్పోరేషన్ లు పాల్గొనకుండా నిషేధించాలని అఖిలభారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) కోరింది.
న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్లో చేపట్టే 5జీ నెట్ వర్క్ ప్రక్రియలో హువాయి, జడ్టీఈ కార్పోరేషన్ లు పాల్గొనకుండా నిషేధించాలని అఖిలభారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) కోరింది.
ఈ మేరకు సీఏఐటీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు ఆదివారం నాడు లేఖ రాసింది. భద్రతా కారణాల దృష్ట్యా హువాయి, గూఢచర్యం కుట్ర, మనీలాండరింగ్ వంటి నేరారోపణలు నమోదైనట్టుగా ఆ లేఖలో సీఏఐటీ ఆరోపించింది.
గాల్వాన్ ఘటన అనంతరం చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భార్జియా ప్రశంసించారు. 59 చైనా యాప్ లను నిషేధించడం చైనా కంపెనీలకు అప్పగించిన హైవే, మెట్రో, రైల్వే కాంట్రాక్టులను రద్దు చేయడం వంటి చర్యలను ఆయన స్వాగతించారు.
తాము చేపట్టిన బాయ్ కాట్ చైనా ప్రచారానికి అనుగుణంగా జాతి మనోభావాలకు అద్దం పడుతూ ప్రభుత్వం సముచిత చర్యలు చేపట్టిందన్నారు. చైనాకు గట్టి సందేశం పంపేలా భారత్లో 5జీ నెట్వర్క్లో పాల్గొనకుండా హువాయి, జడ్టీఈ కార్పొరేషన్లను నిషేధించాలని భార్టియా కోరారు.
అమెరికా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల్లో ఈ కంపెనీల భాగస్వామ్యాన్ని అనుమతించడం లేదని భారత్లోనూ వాటిని అనుమతించరాదని స్పష్టం చేశారు.