Asianet News TeluguAsianet News Telugu

Saayoni Ghosh: టీఎంసీ నాయకురాలు సయోని ఘోష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. హత్యాయత్నం ఆరోపణలపై..

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (Trinamool Congress) నాయకురాలు, నటి సయోని ఘోష్‌ను (Saayoni Ghosh) త్రిపురలో పోలీసులు అరెస్ట్ చేశారు.  శత్రుత్వాన్ని పెంపొందించడం, హత్యయత్నం, నేరపూరిత ఆరోపణలపై త్రిపుర పోలీసులు (Tripura police) ఆమెను అరెస్ట్ చేశారు.

TMC leader Saayoni Ghosh arrested by Tripura police
Author
Agartala, First Published Nov 22, 2021, 12:59 PM IST

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (Trinamool Congress) నాయకురాలు, నటి సయోని ఘోష్‌ను (Saayoni Ghosh) త్రిపురలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్రమ్ చౌముహాని ప్రాంతంలో త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్ దేబ్ (Biplab Kumar Deb).. మున్సిపల్ ఎన్నికల ర్యాలీకి భంగం కలిగించారనే ఆరోపణలపై తూర్పు అగర్తల పోలీస్ స్టేషన్‌లో సయోనిఘోష్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ క్రమంలోనే శత్రుత్వాన్ని పెంపొందించడం, హత్యయత్నం, నేరపూరిత ఆరోపణలపై త్రిపుర పోలీసులు(Tripura police) ఆమెను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పశ్చిమ త్రిపుర అదనపు ఎస్పీ జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మేము సయోని ఘోష్‌పై ఫిర్యాదు అందుకున్నాం. ఆమెను విచారణ కోసం పిలిచాం. సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసి తర్వాత.. ఐపీసీలోని 153, 153A, 307, 120B సెక్షన్ల కింద నమోదైన కేసుకు సంబంధించి ఆమె ప్రమేయం ఉన్నట్లు మాకు ఆధారాలు లభించాయి. మేము ఆమెను అరెస్ట్ చేశాం. కోర్టులో కూడా హాజరు పరిచాం’ అని తెలిపారు. 

అయితే  Saayoni Ghoshపై హత్యాయత్నం ఆరోపణలపై ప్రాథమిక ఆధారాలు కనుగొన్నట్టుగా పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం ఘోష్‌తో పాటు మరో నలుగురు వ్యక్తులు వాహనంలో ఉన్నారని, వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే సయోని ఘోష్ వాహనాన్ని వేరొకరు నడుపుతున్నారని పోలీసులు ధ్రువీకరిస్తున్నప్పటికీ.. ఆమె ఎలా హత్యయత్నం చేసిందని, ఎవరిని చంపడానికి ప్రయత్నించింది అనే వాటిపై పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు. 

మరోవైపు సయోని ఘోష్‌ను త్రిపుర పోలీసులు అరెస్ట్ చేయడాన్ని టీఎంసీ శ్రేణులు, ఆమె అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ముందస్తు కుట్రలో భాగంగానే ఆమెను తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపిస్తున్నారు. ‘ఇది నిరాధారమైన ఆరోపణ. సయోని ఒక సెలబ్రిటీ.. ఆమెను కారులో గుర్తించిన ఎవరో ‘దీదీ, ఖేలా హోబే’ (సోదరి, ఆట కొనసాగుతోంది) అన్నారు. ఆమె కూడా తిరిగి అదే మాట చెప్పింది. దీనికి ఆమెను అరెస్ట్ చేస్తారా..?. ఆమెను దారుణంగా అరెస్టు చేశారు. ఇప్పుడు పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరచలేదు. కాబట్టి బెయిల్ కోసం దరఖాస్తు చేయడానికి అవకాశం లేదు’ అని పశ్చిమ బెంగాల్‌ టీఎంసీ ప్రధాన కార్యదర్శి కునాల్‌ ఘోష్‌ అన్నారు.

సయోని ఘోష్‌పై కేసు నమోదు చేయడం వెనకాల వేరే ఉద్దేశం ఉందని టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు.. సుస్మితా దేవ్ మండిపడ్డారు. టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ర్యాలీకి అంతరాయం కలిగించడమే వారి అసలు లక్ష్యం అని ఆరోపించారు. ఈ కేసు పూర్తిగా కల్పితమైనదని.. దీనిపై న్యాయపరంగా పోరాడుతామని వెల్లడించారు. మేము సయోనికి మద్దతుగా నిలుస్తామని తెలిపారు. 

Also read: ఢిల్లీకి మమతా బెనర్జీ.. పార్లమెంటు సమావేశాలపై విపక్షాలతో కార్యచరణకు వ్యూహం!.. ప్రధానితోనూ భేటీ

ఆదివారం సయోని ఘోష్ బస చేస్తున్న హోటల్ వద్దకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు కోసం ఆమెను పిలిచారని, అయితే అందుకు కారణాన్ని మాత్రం వెల్లడించలేదని టీఎంసీ వర్గాలు తెలిపాయి. సయోని ఘోష్‌తో పాటు పలువురు టీఎంసీ నేతలు తూరు ఆగర్తల పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాని పేర్కొన్నాయి. ఆమె విచారణ కోసం లోనికి వెళ్లిన తర్వాత.. అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న బీజేపీ కార్యాకర్తలు తమ పార్టీ శ్రేణులపై దాడి చేశారని టీఎంసీ ఆరోపించింది. 

పోలీసులు పిలవడంతో సాయోని ఘోష్, కునాల్ ఘోష్ తదితర టీఎంసీ నేతలు అగర్తల ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారని.. ఆమె ఇంటరాగేషన్ కోసం లోపలికి వెళ్లిన తర్వాత హెల్మెట్లు ధరించిన 25 మంది బీజేపీ కార్యకర్తలు చేతుల్లో కర్రలతో అక్కడికి చేరుకుని తమపై కార్యకర్తలపై దాడిచేసినట్టు టీఎంసీ ఆరోపించింది. పోలీస్ స్టేషన్ వద్ద వారి సమక్షంలోనే తమపై కర్రలతో దాడిచేశారని, రాళ్లు విసిరారని పేర్కొన్నారు. ఈ హింసాకాండలో ఆరుగురు తృణమూల్ మద్దతుదారులు గాయపడ్డారని టీఎంసీ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ హింసాకాండలో ఆరుగురు తృణమూల్ మద్దతుదారులు గాయపడ్డారని టీఎంసీ తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను అభిషేక్ బెనర్జీ ట్విట్టర్ లో షేర్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios