దశలవారీగా స్కూల్స్ ఓపెన్ చేయాలి: రణదీప్ గులేరియా
కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చి నుండి మూతపడిన స్కూల్స్ ను దశలవారీగా తెరవాలని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా కోరారు. దేశంలోని పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరిగిందని ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
న్యూఢిల్లీ: దేశంలోని పాఠశాలలను విడతల వారీగా తెరవాలని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా సూచించారు.ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులు పరిశీలించాల్సిందిగా కోరారు.దేశంలో 2020 మార్చి నుండి విద్యాసంస్థలు మూతపడిన విషయం తెలిసిందే. కరోనా నేపత్యంలో విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులకే పరిమితమయ్యాయి.
గత ఏడాది అక్టోబర్ లో స్కూల్స్ రీ ఓపెన్ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. కానీ కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని స్కూల్స్ తెరవడాన్ని నిలిపివేశారు.కరోనా కేసులు తక్కువగా ఉన్న జిల్లాల్లో స్కూల్స్ ను దశలవారీగా తెరవాలని ఆయన సూచించారు. కరోనా కేసులు పెరిగితే స్కూల్స్ ను వెంటనే మూసివేయాలని ఆయన కోరారు.
ఇండియాలోని చిన్నారుల్లో సహజసిద్దంగానే రోగ నిరోధక శక్తి అబివృద్ది చెందిందని ఆయన చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఎయిమ్స్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో పెద్దల కంటే చిన్న పిల్లల్లోనే రోగ నిరోధక శక్తి పెరిగిందని తేలిందన్నారు.కరోనా కేసుల్లో తగ్గుదల నెలకొనడంతో పండుగలు,ఫంక్షన్ల పేరుతో గుమికూడవద్దని ఆయన ప్రజలను కోరారు. ఈ కారణంగానే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.