IAS Sanjeev Khirwar: దేశ రాజధాని ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియం 2010 కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా నిర్మించారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జాతీయ, రాష్ట్ర అథ్లెట్లు, ఫుట్బాల్ క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు. నిత్యం క్రీడాకారులు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటారు.
Delhi government: ఓ ఐఏఎస్ అధికారి తన కుక్కతో కలిసి సాయంత్రం వాకింగ్ చేయడానికి ఏకంగా కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా నిర్మించిన ఓ స్టేడియాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే, తన శునకంతో కలిపి స్టేడియంలోకి వచ్చే క్రమంలో ఆ ఆధికారి సాధారణ సమయం కంటే ముందుగానే అక్కడి అథ్లెట్లు, ఫుట్బాల్ క్రీడాకారులకు శిక్షణను ముంగించాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో అక్కడ శిక్షణ పొందుతున్న వారితో పాటు నిత్యం ప్రాక్టిస్ చేయడానికి వస్తున్న క్రీడాకారులు, అథ్లెట్లు, కోచ్ లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకోవడం గమనార్హం. సదరు ఐఏఎస్ ఢిల్లీ సర్కారులో కీలక అధికారిగా కొనసాగుతున్నారు.
The Indian Express నివేదించిన కథనం ప్రకారం.. గత కొన్ని నెలలుగా.. ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని త్యాగరాజ్ స్టేడియంలోని అథ్లెట్లు మరియు కోచ్లు సాధారణం కంటే ముందుగానే అంటే సాయంత్రం 7 గంటలలోపు శిక్షణ ముగించాలనే ఒత్తిడి వారిపై కొనసాగుతున్నది. దీని కారణంగా అథ్లెట్లు , ఇతర క్రీడాకారులు శిక్షణపై ప్రభావం పడుతున్నదని కోచ్లు, క్రీడాకారులు పేర్కొంటున్నారు. అయితే, ఇలా శిక్షణను ముందుగానే ముగించాలనే ఒత్తిడి వెనుక ఢిల్లీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) సంజీవ్ ఖిర్వార్ ఉన్నారనే ఆరోపణలు చేస్తున్నారు క్రీడాకారులు, అక్కడి కోచ్లు. ఎందుకంటే.. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల తర్వాత ఢిల్లీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) సంజీవ్ ఖిర్వార్ తన కుక్కతో అక్కడి వాకింగ్ వస్తారు.
ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం.. “ఇంతకుముందు మేము ఇక్కడ 8 నుండి 8.30 వరకు శిక్షణను అందించాము. కాని ఇప్పుడు అధికారులు తమ కుక్కను స్టేడియంలో వాకింగ్ కు తీసుకురావడానికి సాయంత్రం 7 గంటలకు శిక్షణ ముగించాలనీ, అందరూ ఆ సమయంలోపే స్టేడియం నుండి బయలుదేరమని ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీని కారణంగా మా శిక్షణ మరియు అభ్యాస దినచర్య దెబ్బతింటుంది" అని అన్నారు. ఇదే కాకుండా.. దాదాపు వారం రోజుల్లో మూడు రోజులు సాయంత్రం 6.30 గంటలకు గార్డులు ఈలలు వేస్తూ మైదానాన్ని ఖాళీ చేస్తున్నారని ఇతర క్రీడాకారులు, అక్కడకు వచ్చేవారు చెప్పారు. కాగా, త్యాగరాజ్ స్టేడియం 2010 కామన్వెల్త్ గేమ్స్ కోసం నిర్మించబడింది. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ జాతీయ మరియు రాష్ట్ర స్థాయి క్రీడాకారులతో పాటు ఫుట్బాల్ క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు.
స్టేడియం నిర్వాహకులు ఏం చెప్పారంటే..?
ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం.. స్టేడియం నిర్వాహకుడు అజిత్ చౌదరి మాట్లాడుతూ.. వేడిని దృష్టిలో ఉంచుకుని అథ్లెట్లకు రాత్రి 7 గంటల వరకు శిక్షణ ఇవ్వడానికి అనుమతిస్తారు. రాత్రి 7 గంటల తర్వాత ఏ ప్రభుత్వ అధికారి కూడా స్టేడియంను వినియోగిస్తున్నట్లు తనకు తెలియదన్నారు. “మేము స్టేడియంను సాయంత్రం 7 గంటలకు మూసివేయాలి. మీరు ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయ వేళలను తనిఖీ చేయవచ్చు. ఇది (స్టేడియం) కూడా ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయం. అలాంటిదేమీ నాకు తెలియదు. నేను సాయంత్రం 7 గంటలకు స్టేడియం వదిలి వెళ్లిపోతాను మరియు నాకు దాని గురించి తెలియదు అని అన్నారు.
అథ్లెట్ల అభ్యాసాన్ని ప్రభావితం చేయలేదు: సంజీవ్ ఖిర్వార్
The Indian Express నివేదిక ప్రకారం.. మంగళవారం రాత్రి 7.30 గంటల తర్వాత ఖిర్వార్ తన కుక్కతో కలిసి స్టేడియానికి చేరుకున్నట్లు కనిపించింది. ట్రాక్ అండ్ ఫుట్బాల్ మైదానంలో ఆయన పెంపుడు జంతువు తిరుగుతూ కనిపించింది. చుట్టూ సెక్యూరిటీ గార్డులు కూడా కనిపించారు. ఆయన పై వచ్చిన ఆరోపణలపై సంజీవ్ ఖిర్వార్ మాట్లాడుతూ.. “నేను ఒక క్రీడాకారుడిని స్టేడియం వదిలి వెళ్ళమని ఎప్పుడూ చెప్పను. స్టేడియం మూతబడిన తర్వాత నేను బయలుదేరుతాను... మేము కుక్కను ట్రాక్పై వదిలిపెట్టము... చుట్టూ ఎవరూ లేనప్పుడు మేము దానిని విడిచిపెట్టాము.. అందులో అభ్యంతరకరం ఏదైనా ఉంటే ఆపేస్తాను’’ అన్నారు .తన పెంపుడు కుక్కను స్టేడియంలో నడకకు తీసుకెళ్తానని అంగీకరించినప్పటికీ.. అది అథ్లెట్ల అభ్యాసాన్ని ప్రభావితం చేయలేదని పేర్కొనడం గమనార్హం.
అథ్లెట్లు తమ శిక్షణను జవహర్లాల్ నెహ్రూ స్టేడియంకు మార్చుకున్నారు
కోచ్లు మరియు అథ్లెట్లు మాట్లాడుతూ.. ఇక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చాలా మంది అథ్లెట్లు తమ శిక్షణను జవహర్లాల్ నెహ్రూ స్టేడియంకు మార్చుకున్నారని తెలిపారు. "ఇంతకుముందు, మేము రాత్రి 8.30 వరకు మరియు కొన్నిసార్లు రాత్రి 9 గంటల వరకు శిక్షణ పొందాము.. కానీ ఇప్పుడు మాకు అలాంటి పరిస్థితి లేదు" అని తెలిపారు.
ఢిల్లీ సర్కారు ఏమందంటే..?
ఈ విషయం ప్రభుత్వ దృష్టికి రావడంతో చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. అలాగే, త్యాగరాజ్ స్టేడియం మూసివేతకు సంబంధించిన విషయం తమ దృష్టికి వచ్చింది. స్టేడియం రాత్రి 10 గంటల వరకు క్రీడాకారులకు, అథ్లెట్లకు అందుబాటులో ఉంచాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారని సిసోడియా పేర్కొన్నారు.
