సెల్ఫీ పిచ్చికి ముగ్గురు బలి: ఒక ట్రైన్ నుంచి తప్పించుకోబోయి..
బంధు మిత్రులతో మధుర క్షణాలను జ్ఞాపకంగా ఉంచుకునేందుకు తీసుకుంటున్న సెల్ఫీలు ప్రాణాలను బలిగొంటున్నాయి. తాజాగా ముగ్గురు యువకులు సెల్ఫీ కారణంగా బలయ్యారు.
బంధు మిత్రులతో మధుర క్షణాలను జ్ఞాపకంగా ఉంచుకునేందుకు తీసుకుంటున్న సెల్ఫీలు ప్రాణాలను బలిగొంటున్నాయి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్ధలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా సెల్ఫీ పిచ్చితో ప్రాణాలు పొగొట్టుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతోంది.
తాజాగా ముగ్గురు యువకులు సెల్ఫీ కారణంగా బలయ్యారు. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని పానిపట్లో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు నలుగురు యువకులు వచ్చారు. ఈ క్రమంలో ఇంట్లో బోర్ కొట్టడంతో పక్కనే వున్న రైల్వే ట్రాక్పై సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు.
అయితే అంతలోనే ఎదురుగా ట్రైన్ రావడంతో.. పక్కకు తొలగాలని భావించారు. కానీ అదే సమయంలో పక్క ట్రాక్పై కూడా మరో రైలు రావడంతో దుర్మరణం పాలయ్యారు. వీరిలో ముగ్గురు మరణించగా.. ఓ వ్యక్తి ట్రాక్కు పక్కగా దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
కాగా సెల్ఫీలు తీసుకునే క్రమంలో సంభవించే మరణాల సంఖ్యలో భారత్ మొదటి స్థానంలో ఉందని పలు గణాంకాలు తెలుపుతున్నాయి. తర్వాతి స్థానాల్లో వరుసగా రష్యా, అమెరికా, పాకిస్తాన్ వంటి దేశాలున్నట్లు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తెలిపింది. 2011 నుంచి 2017 వరకు ప్రపంచవ్యాప్తంగా 259 మంది సెల్ఫీ పిచ్చి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.