క్వారీ గుంతలో పడి మహిళతో సహా.. ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. స్నానం చేయడానికి వెళ్లి మునిగి చనిపోయారు.
తమిళనాడు : తమిళనాడులోని చెన్నై తిరువళ్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లాతిరుత్తణి పెరియార్ నగర్ క్వారీ గుంతలో ఓ మహిళతో సహా ఇద్దరు బాలికలు మునిగి దుర్మరణం పాలయ్యారు. ఓ బంధువు కర్మకాండలో పాల్గొనేందుకు వారు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆరణికి చెందిన మల్లిక (60) ఈ ఘటనలో మృతి చెందిన మహిళ కాగా.. ఆమెతోపాటు గుంతలో పడిపోయిన వారిలో.. ఆరణికి చెందిన బంధువుల పిల్లలు హేమలత (15), గోమతి (14) ఉన్నారు.
వీరు ముగ్గురు మంగళవారం ఉదయం స్నానం చేసేందుకు పెరియార్ నగర్ క్వారీ గుంత దగ్గరికి వెళ్లారు. ఆ గుంతలో దిగి స్నానం చేస్తున్నారు. మొదట ఇద్దరు బాలికలు గుంతలోకి దిగారు. వారు స్నానం చేస్తూ లోతైన ప్రాంతానికి కొట్టుకుపోయి మునిగిపోయారు. గట్టు మీద నుంచి ఇదంతా చూస్తున్న మల్లిక దిగ్భ్రాంతికి గురైంది. ఆ ఇద్దరు బాలికలను కాపాడాలని ఆమె కూడా గుంతలోకి దిగింది. అయితే, గుంతలో నాలుగడుగులు వేసేసరికి.. లోతు ప్రాంతం మొదలవడంతో ఆమె కూడా నీటిలో మునిగిపోయింది.
మునిగిపోతున్న సమయంలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అది విని అక్కడికి చేరుకున్నారు. వారు వచ్చే సమయానికి మల్లిక పూర్తిగా నీటిలో మునిగిపోయింది. వెంటనే స్థానికులు నీటిలోకి దూకి మల్లిక మృతదేహాన్ని వెలికి తీశారు. సమాచారాన్ని పోలీసులకు అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక దళం సభ్యులు క్వారీ గుంతలో గాలించగా… ఇద్దరు బాలికల మృతదేహాలు దొరికాయి.
ఈ ఘటన మీద తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన మీద, ముగ్గురు మృతి చెందడంపై ముఖ్యమంత్రి స్టాలిన్ సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు తలా రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ఇక తిరుత్తణిలో జరిగిన మరో ఘటనలో ఇద్దరు భక్తులు మృతి చెందారు. తిరుత్తణి సమీపంలోని పొన్ పాడి రహదారిలో భక్తులు తిరుపతికి పాదయాత్రగా వెళుతున్నారు. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఆ భక్తుల మీదికి దూసుకు వెళ్ళింది. ఈ ఘటనలో నారాయణన్ (45), సీతారామన్ (20) మృతి చెందారు.
వీరితోపాటు దిండివనానికి చెందిన 40 మంది పాదయాత్రగా తిరుపతికి బయలుదేరారు. పాదయాత్రలో భాగంగా సోమవారం అర్ధరాత్రి వీరంతా పొన్ పాడి రహదారిలో నడిచి వెడుతున్నారు. ఆ సమయంలో చెన్నై నుంచి తిరుపతికి వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. భక్తుల మీదికి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో సీతారామన్, నారాయణన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
