తమ ముఖ్యమంత్రి యూజ్లెస్ అని ఆ పార్టీయే చెప్పింది: ఉత్తరాఖండ్ రాజకీయాలపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు
ఉత్తరాఖండ్ శాసన సభ ఎన్నికల ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించేందుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ఉచిత విద్యుత్తు అందజేస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు.
కొద్దినెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్పై దృష్టిపెట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. 70 ఏళ్ళలో జరగని పనులు ఢిల్లీలో పూర్తయిపోయాయని కేజ్రీవాల్ అన్నారు. రాష్ట్రానికి ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకురావాలని ఉత్తరాఖండ్ ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు. మంచి పాఠశాలలను నిర్మిస్తామని, విద్యుత్తు, నీరు, వ్యవసాయం, ఇంకా అనేక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ప్రజలకు నమ్మకం కలిగించాలనుకుంటున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు.
ప్రతిపక్షాలకు ఓ నాయకుడే లేరని.. ఓ నాయకుడిని ఎంపిక చేసుకోవడం కోసం వారు (బీజేపీ నేతలు) ఢిల్లీకి గత నెలలో వచ్చారంటూ కేజ్రీవాల్ చురకలు వేశారు. ఉత్తరాఖండ్ ప్రజల అభివృద్ధి గురించి ఎవరు ఆలోచిస్తారని ఢిల్లీ సీఎం ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ ప్రజల గురించి ఈ పార్టీలకు శ్రద్ధ ఉందా? అని ఆయన నిలదీశారు. బీజేపీ నేతలు దీనిని పట్టించుకోవడం లేదంటూ ఎద్దేవా చేశారరు. వాళ్ళు కేవలం అధికారం కోసం కొట్టుకుంటున్నారని కేజ్రీవాల్ దుయ్యబట్టారు.
ఉత్తరాఖండ్ను నాశనం చేయడానికి వచ్చిన ఏ అవకాశాన్నీ రాష్ట్ర నేతలు వదులుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. 2000 నుంచి ఒక పార్టీ తర్వాత మరొక పార్టీ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. అధికార పార్టీకి ముఖ్యమంత్రి కాదగిన నేత లేరన్నారు. తమ ముఖ్యమంత్రి యూజ్లెస్ అని ఓ పార్టీ చెప్పడం 70 ఏళ్ళలో ఇదే తొలిసారి అని ఆయన దుయ్యబట్టారు.