ఆ కుక్క ఖరీదు రూ.20కోట్లు...!
హైదరాబాద్ నగరానికి చెందిన వ్యక్తి ఆ కుక్కను అమ్మడం విశేషం. దాని వయసు సంవత్సరంన్నర. దీని పేరు కడబామ్ హేడర్.
మనలో చాలా మంది జంతు ప్రేమికులు ఉంటారు. వారు ఇంట్లో తమ పిల్లలతో సమానంగా ఆ కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. పెంపుడు కుక్కల్లోనూ చాలా రకాలు ఉంటాయి. ఒక్కో కుక్క ఖరీదు ఒక్కోలా ఉంటుంది. కాగా.. తాజాగా ఓ వ్యక్తి దాదాపు రూ.20కోట్లు ఖర్చు చేసి కుక్కను కొనుగోలు చేశాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరులోని కడబామ్స్ కెన్నెల్స్ ఓనర్, ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్.. అరుదైన కుక్కను కొనుగోలు చేశారు. కాకాసియన్ షెపెర్డ్కు చెందిన కుక్కను రూ. 20 కోట్లకు కొనుగోలు చేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన వ్యక్తి ఆ కుక్కను అమ్మడం విశేషం. దాని వయసు సంవత్సరంన్నర. దీని పేరు కడబామ్ హేడర్.
ఈ కుక్కకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది త్రివేండ్రమ్ కెన్నెల్ క్లబ్ ఈవెంట్, క్రౌన్ క్లాసిక్ డాగ్ షోలో పాల్గొంది. బెస్ట్ డాగ్ బ్రీడ్ కింద 32కి పైగా మెడల్స్ గెలుచుకుంది. హేడర్ జీవితకాలం 10 నుంచి 12 సంవత్సరాలు. 45 నుంచి 70 కిలోల వరకు బరువు ఉంటుంది. ఈ జాతి కుక్కలు మన దేశంలో కంటే.... అర్మేనియా, సర్కాసియా, జార్జియా, రష్యా వంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
రూ.20కోట్లు పెట్టి కుక్కను కొనుగోలు చేయడంతో.. సతీష్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. అయితే... అతను గతంలోనూ ఇలాంటి ఖరీదైన కుక్కలను కొనుగోలు చేసేవాడట. అతని దగ్గర ఇప్పటికే రూ.10కోట్ల టిబెటన్ మస్తిఫ్, రూ.8కోట్ల అలస్కన్ మాలామ్యూట్, రూ. కోటి విలువ గల కొరియన్ డోసా మస్తిఫ్ జాతి కుక్కలు ఉండటం విశేషం.