రానున్న 6 నుండి 8 వారాల్లో కరోనా థర్డ్వేవ్: ఎయిమ్స్ చీఫ్ గులేరియా
వచ్చే ఆరు నుండి 8 వారాల్లో కరోనా మూడో వేవ్ ఇండియాను తాకే అవకాశం ఉందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: వచ్చే ఆరు నుండి 8 వారాల్లో కరోనా మూడో వేవ్ ఇండియాను తాకే అవకాశం ఉందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పష్టం చేశారు. దేశ ప్రజలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పెద్ద సవాల్ గా ఆయన పేర్కొన్నారు. అంతేకాదు కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోస్ మధ్య గ్యాప్ పెరుగుదలతో ఎలాంటి నష్టం లేదని ఆయన తేల్చి చెప్పారు. డెల్టా వేరియంట్ నుండి ఉద్భవించిందే డెల్టా వేరియంట్ ప్లస్ అని ఆయన చెప్పారు.
అన్లాక్ ప్రారంభమౌతున్న సమయంలో ప్రజలు ఎక్కువ సంఖ్య గుమికూడడం జరుగుతున్న చోట జాగ్రత్తలు పాటించకపోతే కరోనా కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉందన్నారు. థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఆరు నుండి 8 వారాల్లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. దేశ జనాబాలో 5 శాతం ప్రజలు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని 130 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొంది.
కొత్త వైరస్ వేరియంట్ అభివృద్ది చెందాలంటే మూడు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. అయితే కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకుగాను కోవిడ్ ప్రోటోకాల్స్ ను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.యూకేలో కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తి చెందుతుందన్నారు. ఈ సమయంలో వైరస్ ఇంకా పరివర్తన చెందుతోందన్నారు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
కరోనా మొదటి వేవ్ లో ఈ వైరస్ వ్యాప్తి అంతగా లేదన్నారు. కానీ రెండో వేవ్ లో వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని ఆయన గుర్తు చేశారు. డెల్టా వేరియంట్ అంటువ్యాధిగా ఆయన పేర్కొన్నారు.డెల్టా ప్లస్ వేరియంట్ వైరస్ ఎలా ప్రవర్తిస్తోందో ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు.