ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు.. దేశంలో మొత్తం కేసులు 8: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. దీంతో దేశంలో మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య 8కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా రాజ్యసభలో వెల్లడించారు. ఢిల్లీలో నివసిస్తున్న 35 ఏళ్ల నైజీరియన్ పౌరుడికి ఈ వైరస్ సోకింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. దీంతో ఢిల్లీలో మంకీపాక్స్ కేసుల సంఖ్య 3కు చేరింది. ఈ కేసుతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఎనిమిదికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా తెలిపారు. ఇప్పటి వరకు మన దేశంలో ఎనిమిది మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయా ఈ రోజు రాజ్యసభలో వెల్లడించారు. ఇందులో ఐదుగురికి విదేశీ పర్యటన వెళ్లివచ్చినట్టుగా ట్రావెల్ హిస్టరీ ఉన్నదని తెలిపారు.
మన దేశంలో తొలి మంకీపాక్స్ కేసు జులై 14న రిపోర్ట్ అయింది. అయితే, ఈ కేసు నమోదు కావడానికి చాలా రోజుల ముందే మే 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం మంకీపాక్స్ కట్టడి కోసం గైడ్లైన్స్ రూపొందించింది. వాటిని అన్ని రాష్ట్రాలకు పంపిందని కేంద్ర మంత్రి వివరించారు. అంతర్జాతీయ విమానాశ్రయాలపై ఆరా, నిఘా మెకానిజం, కాంటాక్ట్ ట్రేసింగ్, అనుమానితుల నుంచి శాంపిళ్లు ఎలా కలెక్ట్ చేయాలి వంటి అనేక అంశాలపై ఇది వరకే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గైడ్ లైన్స్ పంపిందని తెలిపారు.
మూడు ప్రైవేటు హాస్పిటళ్లలో ఐసొలేషన్ గదులు ఏర్పాటు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇది వరకే ఆదేశించినట్టు చెప్పారు. మంకీపాక్స్ ధ్రువీకరణ అయిన కేసుల కోసం ఐదు గదులను రిజర్వ్ చేయాలని, అలాగే, అనుమానితుల కోసం మరో ఐదు గదులను రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపినట్టు పేర్కొన్నారు.
ఢిల్లీలో నివసిస్తున్న 35 ఏళ్ల నైజీరియన్ పౌరుడికి ఈ వైరస్ పాజిటివ్గా తేలింది. ఆయన ఇటీవలే విదేశీ పర్యటన చేయలేదు. కానీ, అనారోగ్యంతో హాస్పిటల్లో చేరాాడు. మంకీపాక్స్ వైరస్ చికిత్సకు నోడల్ హాస్పిటల్గా నిర్ణయించిన ప్రభుత్వ పరిధిలోని ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయ్యాడు. ఆయన శాంపిల్స్ ఎన్ఐవీకి పంపారు. ఈ శాంపిల్స్ ఫలితాల్లో మంకీపాక్స్ పాజిటివ్ అని తేలింది.