ఒమిక్రాన్తో జనించే యాంటీబాడీలు.. డెల్టా వేరియంట్నూ నాశనం చేయగలవు: ఐసీఎంఆర్ అధ్యయనం
ఐసీఎంఆర్ అధ్యయనం కీలక విషయాన్ని వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఒక పేషెంట్లో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు డెల్టా వేరియంట్ సహా ఇతర అన్ని హానికారక వేరియంట్లను నాశనం చేసే శక్తిని కలిగి ఉంటుందని ఈ అధ్యయనం తేల్చింది. తద్వారా డెల్టా వేరియంట్ల రీఇన్ఫెక్షన్లు తగ్గడం, తద్వార డామినెంట్ వేరియంట్గా డెల్టా మరెంతో కాలం ఉండకపోవచ్చనే అభిప్రాయాలను తెలిపింది.
న్యూఢిల్లీ: టాప్ మెడికల్ బాడీ.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) అధ్యయనంలో కీలక విషయం వెల్లడి అయింది. ఒమిక్రాన్ సోకిన తర్వాత సదరు పేషెంట్లో జనించే యాంటీబాడీలు ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కోవడమే కాదు.. డెల్టా సహా అన్ని వేరియంట్లనూ నాశనం చేయగలవని తేలింది. ఒమిక్రాన్ వేరియంట్తో ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తిలో గణనీయమైన ఇమ్యూన్ రెస్పాన్స్ జెనరేట్ అవుతుందని ఆ అధ్యయనం తెలిపింది.
ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా సదరు పేషెంట్లో ఉత్తేజితం అయ్యే ఇమ్యూన్ రెస్పాన్స్ డెల్టా వేరియంట్నూ ఎదుర్కొంటాయని, కాబట్టి, రీ ఇన్ఫెక్షన్లు గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆ అధ్యయనం తెలిపింది. తద్వారా డామినెంట్ వేరియంట్గా డెల్టా వేరియంట్ ఎంతో కాలం ఉండబోదనే అభిప్రాయాన్ని పేర్కొంది. అదే తరుణంలో వ్యాక్సిన్ల తయారీ, పంపిణీ విధానాల్లోనూ మార్పులు చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. ఒమిక్రాన్ లక్ష్యంగా చేసుకుని టీకా వ్యూహాన్ని రూపొందించాలని సూచనలు చేసింది.
కరోనా మహమ్మారి కారణంగా మనదేశంలో థర్డ్ వేవ్ వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఈ వేరియంట్కు సంబంధించిన పరిశోధనలు ఐసీఎంఆర్ చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడ్డ వారి నుంచి తీసుకున్న శాంపిళ్లను పరిశీలిస్తే ఈ విషయం వెలికి వచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ స్వల్ప సమయంలోనే అత్యంత వేగంగా వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని పేర్కొంది. కరోనా బారిన పడిన తర్వాత బాడీలో జెనరేట్ అయ్యే ఇమ్యూనిటీ లేదా టీకా వేసుకుని ప్రేరేపించే వ్యాధి నిరోధక శక్తిని ఒమిక్రాన్ వేరియంట్ తప్పించుకునే శక్తిని కలిగి ఉన్నదని వివరించింది. కాబట్టి, ఈ ఒమిక్రాన్ వేరియంట్కు సంబంధించిన ఈ వ్యాధి నిరోధక శక్తిని తప్పించే సామర్థ్యంపై మరింత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడింది.
గత 24 గంటల్లో కరోనా కొత్త మరణాల మరింతగా పెరిగాయి. కొత్తగా 2.85 లక్షల కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అలాగే, 665 మంది వైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు రోజుతో పోలిస్తే కోవిడ్ కేసులు, మరణాలు 11 శాతానికి పైగా పెరిగాయి. దేశంలో కరోనా రికవరీ రేటు (India's recovery rate) 93.23 శాతంగా ఉంది. కరోనా మరణాల రేటు 1.23 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,00,85,116 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 4,91,127 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మహరాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కరోనా పంజా విసురుతోంది. గత 24 గంటల్లో అక్కడ 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాలు సైతం అక్కడే అధికంగా వెలుగుచూస్తున్నాయి. మొత్తంగా కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాను గమనిస్తే.. మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్ లు టాప్లో ఉన్నాయి. అత్యంత వేగంగా విస్తరిస్తున్న కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా దేశంలో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.