ఫిర్యాదు చేసేందుకు వచ్చి.. పోలీస్ స్టేషన్ లోనే నిప్పంటించుకున్న యువతి.. ఎందుకంటే ?
ఓ రెవెన్యూ అధికారి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, శారీరకంగా వాడుకున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ పోలీస్ స్టేషన మెట్లు ఎక్కింది. ఆ సమయంలో నిందితుడిని పోలీసులు అక్కడికి పిలిపించారు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన ఆ మహిళ అక్కడే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.
ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చి, అందరి ముందరే ఓ యువతి తన శరీరానికి నిప్పంటించుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ యువతి హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
జమ్మూకాశ్మీర్ కాంగ్రెస్కు షాక్.. మరో సీనియర్ నేత రాజీనామా
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని షాడోల్ జిల్లాలో 26 ఏళ్ల యువతిని రెవెన్యూ అధికారి (పట్వారీ) పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొన్ని నెలల క్రితం నుంచి ఆమెతో శారీరక సంబంధాన్ని ఏర్పర్చుకున్నాడు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి కోరినా.. అక్కడి నుంచి సరైన స్పందన రాలేదు. ఆమె ఫోన్ కాల్స్ చేసినా వాటిని ఎత్తడం లేదు. దీంతో ఆ యువతి తాను మోసపోయానని గ్రహించింది.
పట్వారీపై కేసు పెట్టాలని నిర్ణయించుకుంది. దీంతో ఆమె షాడోల్ జిల్లాలోని బుధార్ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఆమెకు జరిగిన అన్యాయాన్ని మొత్తం పోలీసులకు వివరించింది. తాను రెవెన్యూ అధికారిపై ఫిర్యాదు చేయడానికి వచ్చానని బాధితురాలు తెలిపింది. అయితే ఆమె ఫిర్యాదును పోలీసులు అంగీకరించలేదని మహిళ ఆరోపించింది. దీనికి బదులు ‘‘ఈ విషయాన్ని బయటనే పరిష్కరించుకో ’’ అని ఆమెకు సలహా ఇచ్చారు. దీంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయింది.
శుక్రవారం మరోసారి అదే పోలీసు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ రెవెన్యూ అధికారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఈ సమయంలో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. కొంత సమయం తరువాత మనస్థాపం చెందిన మహిళ ఆకస్మాత్తుగా తన శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే స్పందించిన అక్కడున్న సిబ్బంది మంటలను ఆర్పారు. కానీ ఆమె శరీరంపై కాలిన గాయాలయ్యాయి. తరువాత ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన సంచలనం సృష్టించడంతో రెవెన్యూ అధికారిని చివరికి పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం ఉన్నతాధికారుల వద్దకు చేరుకుంది. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసు సూపరింటెండెంట్ కుమార్ ప్రతీక్ ఆదేశించారు.
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే 9152987821 అనే ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సహాయం చేస్తారు.