Kedarnath: తెరచుకున్న కేదార్నాథ్ ఆలయం... మైనస్ 6 డిగ్రీల్లోనూ భక్తుల పూజలు
Kedarnath: జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయ ద్వారాలను ఇవాళ ఉదయం వేదోచ్ఛరణ మధ్య ఆలయ ప్రధాన పూజారి జగద్గురు రావల్ బీమా శంకర్ లింగ శివాచార్య తెరిచారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సుమారు 20 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఆలయ తలుపులు తెరిచే సమయానికి సుమారు ఎనిమిది వేల మంది భక్తులు అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది.
![The Portals Of Kedarnath Dham Opened Today Morning KRJ The Portals Of Kedarnath Dham Opened Today Morning KRJ](https://static-ai.asianetnews.com/images/01gr637sjakdw4rxm3kd82ak02/kedar2_363x203xt.jpg)
Kedarnath: పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ లోని బాబా కేదారీశ్వరుడి ఆలయం శివనామస్మరణ మధ్య తెరువబడింది. మంగళవారం నాడు వేదోచ్ఛరణ మధ్య ఆలయ ద్వారాలను ప్రధాన పూజారి జగద్గురు రావల్ బీమా శంకర్ లింగ శివాచార్య తెరిచారు. సోమవారమే కేదార్నాథ్ ఆలయానికి ఉత్సవ మూర్తిని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ప్రతికూల వాతావరణం దృష్ట్యా సోమవారం భక్తులను వెళ్లేందుకు అనుమతించలేదు. అయితే మంగళవారం ఉదయం ఆలయ తలుపులు తెరుచుకునే సరికి దాదాపు ఎనిమిది వేల మంది భక్తులు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సుమారు 20 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఇప్పుడు వచ్చే ఆరు నెలల పాటు భక్తులు ఆలయాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది.
మరోవైపు.. ఏప్రిల్ 29 వరకు హిమపాతం, వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కేదార్నాథ్ భక్తుల నమోదును 30వ తేదీ వరకు నిలిపివేసింది. రిషికేశ్, గౌరీకుండ్, గుప్తకాశీ, సోన్ప్రయాగ్తో సహా అనేక ప్రదేశాలలో ప్రయాణీకులను ప్రస్తుతానికి అక్కడే ఉండమని కోరుతున్నారు.
భక్తులకు విజ్ఞప్తి
అంతకుముందు.. శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ మంగళవారం ఉదయం 06:20 గంటలకు కేదార్నాథ్ ధామ్ తలుపులు సందర్శకుల కోసం తెరవబడతాయని చెప్పారు. బాబా కేదార్ యొక్క పంచముఖి చాల్ విగ్రహ డోలీ కూడా సోమవర్ ధామ్ చేరుకుంది. విపరీతమైన చలి ఉన్నప్పటికీ.. ఆలయ తలుపులు తెరవడాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు కేదార్నాథ్ ధామ్కు చేరుకున్నారని అజేంద్ర అజయ్ చెప్పారు. కేదార్నాథ్ లో అడపాదడపా హిమపాతం, వర్షం కురుస్తున్న దృష్ట్యా, యాత్ర ప్రారంభించే ముందు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ముందస్తుగా కేదార్నాథ్ ధామ్లో బస ఏర్పాట్లు చేయాలని ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు.