క్షణ కాలంలోనే చెలరేగిన మంటలు.. నేపాల్ విమాన ప్రమాదాన్ని ఫేస్బుక్ లైవ్లో రికార్డ్ చేసిన భారతీయ యువకులు..
నేపాల్ లో విమానం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు యూపీకి చెందిన నలుగురు యువకులు ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు. అయితే ఇలా వీరు లైవ్ లో ఉన్న సమయంలోనే విమానం ఒక్క సారిగా కూలిపోయింది. క్షణాల్లోనే మంటలు చెలరేగడం కూడా అందులో కనిపిస్తోంది.
నేపాల్ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పోఖారాలో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమవుతుండగా యతి ఎయిర్లైన్స్ కు చెందిన ఏటీఆర్ -72 విమానం కుప్పకూలిపోయింది. దీంతో 72 మంది సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో 5 గురు భారతీయులు కూడా మరణించారు. వీరిలో నలుగురు ఉత్తప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే.
ఈ యువకులు యూపీలో ఘజిపూర్ జిల్లాకు చెందిన వారు. ఇందులో సోనూ జైస్వాల్ అనే వ్యక్తి తన మొక్కు చెల్లించుకునేందుకు ఖట్మాండులోని పశుపతినాథ్ ఆలయానికి వెళ్లారు. తన వెంటనే మరో ముగ్గురు స్నేహితులను కూడా తీసుకెళ్లారు. అయితే ఈ యువకులు విమాన ప్రమాదానికి సంబంధించిన చివరి క్షణాలను ఫేస్బుక్ లైవ్లో బంధించారు. విమానం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు వీరు లైవ్ మొదలుపెట్టారు. ఇందుల ప్రమాదం జరిగిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటి వరకు సరదాగా ఉన్న అందరూ క్షణాల్లోనే సజీవదహనం అయ్యారు.
గురుద్వారాలో ఈ అమెరికన్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా..!
ఫేస్బుక్లో ఉన్న 1.3 నిమిషాల లైవ్ వీడియోలో యువకులు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. విమానం గాలిలో ఉన్నప్పుడు కిటికీలో నుంచి పోఖరా పట్టణాన్ని చూపిస్తూ వారిలో ఒకరు ఉత్సాహంగా ‘‘మౌజ్ కర్ ది’’ (ఇది సరదాగా ఉంది) అని కేకలు వేయడం వినిపిస్తోంది. యువకుల్లో ఒకరైన సోను జైస్వాల్ (29) ఫోన్ కెమెరాలో స్పష్టంగా కనిపించారు. ఈ వీడియోలోని 58 సెకన్ల ఫుటేజీలో విమానం కూలిపోవడానికి ముందు వేగంగా ఎడమవైపు మలుపు తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. తరువాతి ముప్పై సెకన్ల పాటు ఫోన్ కెమెరాను మంటలు చుట్టుముట్టాయి. తరువాత లైవ్ ఆగిపోయింది.
ఈ వీడియోలో ముఖ్యంగా సోను జైస్వాల్ కనిపిస్తుండగా..ఆయనతో పాటు అనిల్ రాజ్భర్ (28), విశాల్ శర్మ (23), అభిషేక్ సింగ్ కుష్వాహా (23)లు కూడా ఉన్నారు. వీరు జనవరి 13న పశుపతినాథ్ ఆలయంలో పూజలు చేశారు. తరువాత ఖాట్మండులో దిగారు. పారాగ్లైడింగ్ కోసం పోఖారాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ నలుగురు ఘాజీపూర్ జిల్లాలోని బరేసర్, నోనహరా ప్రాంతాల్లోని పలు గ్రామాలకు చెందిన వారు. ఈ వార్త తెలియగానే ఆ గ్రామాల్లో విషాదం అలుముకుంది. సోనూ జైస్వాల్ మద్యం వ్యాపారి కాగా, అనిల్ రాజ్భర్, అభిషేక్ కుష్వాహా ఘాజీపూర్లోని జహూరాబాద్, అలవల్పూర్లలో జన్ సేవా కేంద్రాలను నడుపుతున్నారు. విశాల్ శర్మ టూవీలర్ కంపెనీలో పని చేస్తున్నారు. ఈ లైవ్ వీడియో సోనూ జైస్వాల్ ఫేస్బుక్ ఐడీ నుంచి టెలికాస్ట్ అయ్యింది. దీనిని అతడి కజిన్ రజత్ జైస్వాల్ ధృవీకరించారని ‘జీ న్యూస్’ నివేదించింది.
ఢిల్లీలో దారుణం.. స్క్రాప్ దొంగిలించాడనే అనుమానం వ్యక్తిని కొట్టి చంపారు..
నేపాల్ విమాన ప్రమాదంలో జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు మరణించిన విషయాన్ని ఘాజీపూర్ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీనిపై బరేసర్ ఎస్హెచ్ఓ దేవేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ..‘‘ అనిల్, అభిషేక్, విశాల్, సోను అనే నలుగురు జనవరి 13న నేపాల్కు బయలుదేరి ఒక వారం పాటు ఉండాలని ప్లాన్ చేసుకున్నారు’’ అని తెలిపారు. సర్కిల్ అధికారి కాసిమాబాద్ బలరామ్ సింగ్ మాట్లాడుతూ.. తాను ఎస్డీఎంతో కలిసి నలుగురు యువకుల మృతదేహాలను ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తానని, బాధిత కుటుంబాలకు సహకరిస్తానని చెప్పారు.