కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రినే ఈ సారి కూడా సీఎం పీఠం ఎక్కించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నిర్ణయించారు. డీకే శివ కుమార్ కు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించనున్నారు. వీరి ప్రమాణ స్వీకారం ఈ నెల 20వ తేదీన జరగనుంది.
నాలుగు రోజుల ప్రతిష్టంభన తర్వాత కర్ణాటక సీఎం ఎవరనే విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. ఈ దక్షిణాది రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రిగా పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీంతో కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యకే తన ఆమోద ముద్ర వేసినట్టు ‘ఇండియా టుడే’ కథనం తెలిపింది. అయితే కర్ణాటక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నెల 20న బెంగళూరులో వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.
Hyderabad: తనతో కలిసి లిక్కర్ తాగలేదని భార్యకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మధ్య బుధవారం పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి వరకు ఈ పదవిపై సస్పెన్స్ నెలకొంది. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) చీఫ్ డీకే శివకుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ చర్చల్లో సీనియర్ నేత సిద్ధరామయ్యతో అధికార భాగస్వామ్య ఒప్పందానికి డీకే శివకుమార్ అంగీకరించారని తెలుస్తోంది.
సిద్ధరామయ్య గానీ, డీకేఎస్ గానీ ఒంటరిగా ప్రమాణ స్వీకారం చేయలేరని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ‘‘ఇది సమిష్టి నాయకత్వమని, వన్ మ్యాన్ షోను అధినాయకత్వం కోరుకోవడం లేదు. శివకుమార్ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేనందున చర్చలు జరుగుతున్నాయి’’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయని ‘ఇండియా టుడే’ నివేదించింది.
గూఢచర్యం కేసులో జర్నలిస్ట్, నేవీ మాజీ కమాండర్ అరెస్ట్
కాగా.. మే 10వ తేదీన జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ 224 స్థానాలకు గాను 135 స్థానాలను గెలుచుకుని బీజేపీని అధికారం నుంచి తరిమికొట్టింది. బీజేపీ 66 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. కింగ్ మేకర్ పాత్ర పోషించాలని భావించిన జేడీఎస్ కేవలం 19 సీట్లతో సరిపెట్టుకుంది. అయితే కాంగ్రెస్ ఘన విజయం సాధించినప్పటికీ సీఎం పదవిపై సస్పెన్స్ కొనసాగింది. మాజీ సీఎం సిద్ధరామయ్య, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఈ సీఎం పదవి కోసం పోటీ పడ్డారు.