రాహుల్ గాంధీ యాత్రను ఆపడానికి కోవిడ్ అంశం తీసుకువచ్చిన కేంద్రం.. : శివసేన
Mumbai: కరోనా వైరస్ మార్గదర్శకాలు పాటించండి లేదా భారత్ జోడో యాత్రను వాయిదా వేసుకోండి అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు లేఖ రాశారు. ఇప్పుడు ఈ అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది.
Bharat Jodo Yatra: కరోనా వైరస్ ప్రోటోకాల్స్ పాటించకపోతే భారత్ జోడో యాత్రను నిలిపివేయడం లేదా వాయిదా వేయడం గురించి ఆలోచించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ లకు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవీయ రాసిన లేఖపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన విభాగం కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల నుంచి వస్తున్న భారీ స్పందన నేపథ్యంలోనే యాత్రను ఆపివేయడానికి ఇలా కేంద్రం కరోనా వైరస్ ను తెరమీదకు తీసుకువచ్చిందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. భారత్ జోడో యాత్రలో కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని లేదా పాదయాత్రను ఆపాలని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్నారు. పెద్ద ఎత్తున ప్రజల మద్దతును పొందుతున్నారు. ప్రభుత్వం దీనిని చట్టం ద్వారా లేదా కుట్ర ద్వారా ఆపలేకపోయింది.. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 'కోవిడ్ -19' వైరస్ ను తెరమీదకు తీసుకువచ్చినట్టు అనిపిస్తుంది" అని థాకరే శిబిరం మౌత్ పీస్ సామ్నా సంపాదకీయం పేర్కొంది.
'భారత్ జోడో' యాత్ర హడావిడి కారణంగా కోవిడ్ కేసులు పెరుగుతాయనే భయం సరైనదే. కానీ మూడేళ్ల క్రితం కరోనా వినాశనం సృష్టించినప్పుడు, అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుజరాత్ కు ఆహ్వానించి, అతని గౌరవార్థం లక్షలాది మందిని సమీకరించింది మీరే' అని కేంద్రంలోని బీజేపీ తీరును ఎండగట్టింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా కోవిడ్ -19 మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ లకు లేఖ రాశారు. 'రాజస్థాన్లో జరుగుతున్న భారత్ జోడో యాత్ర సందర్భంగా కోవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించండి. మాస్కులు, శానిటైజర్ వాడకం తప్పనిసరిగా అమలు చేయాలి. టీకాలు వేసిన వారు మాత్రమే పాల్గొనాలి' అని ఆరోగ్య మంత్రి లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రోటోకాల్ పాటించలేకపోతే పాదయాత్రను వాయిదా వేయాలని మాండవీయ పేర్కొన్నారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటించడం సాధ్యం కాకపోతే, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జాతీయ ప్రయోజనాల దృష్ట్యా భారత్ జోడో యాత్రను వాయిదా వేయాలని లేఖలో పేర్కొన్నారు.
భారత్ జోడోలో భారీ సంఖ్యలో ప్రజల నుంచి మద్దతు వస్తుండటంతో మోడీ ప్రభుత్వం భయపడినందునే ఈ లేఖ రాశారని రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ ఆరోపించింది. రాహుల్ గాంధీకి లభిస్తున్న మద్దతు చూసి బీజేపీ ఇలా కొత్త కుట్రకు తెరలేపిందని కాంగ్రెస్ ఘాటుగానే స్పందిస్తోంది. రాజస్థాన్ లో భారత్ జోడో యాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో బీజేపీ, మోడీ ప్రభుత్వం చాలా ఆందోళన చెందాయనీ, రాజస్థాన్ లో కోవిడ్ -19 ప్రోటోకాల్ ను అనుసరించాలని రాహుల్ గాంధీకి లేఖలు రాస్తున్నారని గెహ్లాట్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. భారత్ జోడో యాత్రను భగ్నం చేయడమే బీజేపీ లక్ష్యమని ఆరోగ్య మంత్రి చర్య స్పష్టంగా చూపిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. భారత్ జోడో యాత్రకు పెరుగుతున్న ప్రజా మద్దతుతో కలత చెందిన బీజేపీ దానిని భంగపరచడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. లేఖ రాయడం ప్రజల ప్రయోజనాల కోసం కాదని, రాజకీయ ప్రేరేపిత చర్య అని ఆయన విమర్శించారు.
రెండు రోజుల క్రితం త్రిపురలో ప్రధాని మోడీ ర్యాలీలు నిర్వహించారు. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో కూడా పశ్చిమ బెంగాల్లో ప్రధాని భారీ ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి లక్ష్యం రాజకీయం కాకపోతే, ఆయన ఆందోళన న్యాయసమ్మతం అయితే, ఆయన ప్రధానికి మొదటి లేఖ రాయాల్సింది: అశోక్ గెహ్లాట్