అగ్రవర్ణాల పార్టీ కాబట్టే కుల గణన అంటే బీజేపీకి భయం.. ఎన్నికల ముందే కుల గణన చేయాలి : ప్రతిపక్షాల డిమాండ్
Bhopal: "వీళ్లు (ప్రభుత్వం) దేనికి భయపడుతున్నారో.. ఏం దాచాలని చూస్తున్నారో నాకు తెలియదు... రాష్ట్రంలో కులాల వారీగా జనాభా గణన నిర్వహించడం చాలా ముఖ్యం. మధ్యప్రదేశ్ లో మా ప్రభుత్వం ఏర్పడగానే ఇక్కడ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాం" అని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ అన్నారు.
caste census in Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కుల ఆధారిత జనాభా గణన చేపట్టాలని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు డిమాండ్ చేశాయి. వివరాల్లోకెళ్తే..దేశంలో గత కొన్ని నెలలుగా కుల గణన పై చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కులాల వారిగా జనాభా గణన నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ విషయంలో బీజేపీ ప్రభత్వం పరోక్షంగా కుదరదనే సంకేతాలు పంపుతోంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కుల గణన కోసం నిర్ణయం తీసుకుంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే బీహార్ లో కుల గణనను చేపట్టింది. అలాగే, కేంద్ర ప్రభుత్వం సైతం కుల గణన చేపట్టాలని అక్కడి నితీష్ కుమార్ సారథ్యంలోని ప్రభుత్వం పేర్కొంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు కుల గణన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ లోనూ ఎన్నికలకు ముందే కుల గణన చేయాలని అక్కడి ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో కుల గణనకు గురించి విషయాల గురించి ప్రజలకు వివరిస్తూ.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.
మధ్యప్రదేశ్ లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కుల ఆధారిత జనాభా గణన చేపట్టాలని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు డిమాండ్ చేశాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాథ్ విలేకరులతో మాట్లాడుతూ, "సమతుల్యత కోసం కుల గణన చాలా అవసరం, అది ఎందుకు చేయకూడదు? ఇంతకీ వీళ్లు (బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం) దేనికి భయపడుతున్నారు, దేనిని దాచడానికి ప్రయత్నిస్తున్నారు? వెంటనే కుల గణన చేపట్టాలి" అని ఆయన అన్నారు. బుందేల్ ఖండ్ నుంచి మహాకౌశల్, గ్వాలియర్ చంబల్ వరకు రాష్ట్రంలో కులంలో అనేక వైవిధ్యాలు ఉన్నాయన్నారు. "ఇక్కడ జాతి, కుల వైవిధ్యం ఉంది. ఈ విషయం జనాభా లెక్కల్లో బట్టబయలవుతుంది. ఈ సర్వే ద్వారా ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) రిజర్వేషన్లలో సముచిత స్థానం లభిస్తుంది" అని కమళ్ నాథ్ అన్నారు.
సమాజ్ వాదీ పార్టీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కుల గణన డిమాండ్ పై జిల్లాల్లో సభలు, ర్యాలీలు నిర్వహించడం ప్రారంభించింది. "అగ్రవర్ణాల వారి పార్టీ కాబట్టే కుల గణన అంటే బీజేపీకి భయం. ఓబీసీలకు ఎంత అన్యాయం జరుగుతోందో కుల గణన ద్వారా తెలుస్తుందన్నారు. వారికి ప్రయోజనాలు, రిజర్వేషన్లు అందడం లేదు. మధ్యప్రదేశ్లో ఓబీసీల జనాభా 50 శాతానికి పైగా ఉంది. కానీ వారికి మొత్తం కోటాలో 27 శాతం కూడా లభించడం లేదు" అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామాయణ్ సింగ్ పటేల్ అన్నారు. ఇదే డిమాండ్ చేస్తూ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఈ డిమాండ్ ను బీజేపీ 'పొలిటికల్ స్టంట్'గా అభివర్ణించింది. ఓబీసీ జనాభా గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టుకు తెలియజేసిందని, కాబట్టి జనాభా గణన కారణంగా రిజర్వేషన్లు ఆలస్యమవుతున్నాయని వారు (ప్రతిపక్షాలు) చెప్పలేరని బీజేపీ ఓబీసీ విభాగం నాయకుడు నారాయణ్ సింగ్ కుష్వాహా అన్నారు.