Thanjavur girl suicide case: తంజావూరు విద్యార్థిని ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలైన సగయ మేరీకి స్వాగతం పలికేందుకు ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎమ్మెల్యే ఇనిగో ఇరుదయరాజ్ తిరుచ్చి సెంట్రల్ జైలుకు వెళ్లారు. ఆమెకు శాలువ కప్పి స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా షేర్ చేయడంతో .. ఈ విషయంలో రాజకీయంగా దుమారం రేగుతోంది.
Thanjavur girl suicide case: తమిళనాడులోని తంజావూరు విద్యార్థిని ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలైన సగయ మేరీకి స్వాగతం పలికేందుకు ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎమ్మెల్యే ఇనిగో ఇరుదయరాజ్ తిరుచ్చి సెంట్రల్ జైలుకు వెళ్లారు. బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన సగయ మేరీకి శాలువా కప్పి స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎమ్మెల్యే తన ఫేస్బుక్ పేజీలో పంచుకున్నారు.
పేద పిల్లలను చదివించడం కోసం సగయ మేరీ తన జీవితాన్ని త్యాగం చేసిందని ఆయన తన పోస్ట్లో పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలను ఎదుర్కొనే దృఢ సంకల్పం ఆమెకు ఉంది. నిజాయితీతో ఆమెను కోర్టు విడుదల చేసిందని తెలిసి, తాను స్వయంగా తిరుచ్చి మహిళా సెంట్రల్ జైలుకు వెళ్లి ఆమెను స్వాగతించాను. న్యాయం గెలుస్తుంది. మత సామరస్యం కోసం మేము నిరంతరం కృషి చేస్తాము.. అని ఎమ్మెల్యే తన పోస్టులో పేర్కొన్నారు.
ఈ పోస్టుకు కౌంటర్ గా.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై .. తంజావూరు విద్యార్థిని ఆత్మహత్య చేసుకునే ముందు తీసుకున్న 44 సెకన్ల నిడివి గల డైయింగ్ డిక్లరేషన్ వీడియోను విడుదల చేయడంతో రాజకీయ దుమారం రేగుతోంది. ఆ హస్టల్ వార్డెన్ బలవంతంగా బాధితురాలిని మత మార్పిడి చేసిందనీ, ఈ మేరకు ఆ విద్యార్థినిని హింసించారని ఆరోపించారు.
మరోవైపు ఈ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. అయితే.. మద్రాస్ కోర్టు తీరును డీఎంకే తప్పు పట్టింది. తమిళనాడు పోలీసు శాఖ కు ఈ కేసును సీబీఐకి బదిలీ చేయడాన్ని వ్యతిరేఖించింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టు కు వెళ్లిన వారికి చుక్కెదురైంది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించడం కరెక్టే నని స్ఫష్టం చేసింది.
తంజావూరు ఆత్మహత్య కేసు:
అరియాలూర్ జిల్లా వదుగపలయమ్ కీజా ప్రాంతానికి చెందిన విద్యార్థిని.. సేక్రెడ్ హార్ట్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. స్థానికంగా ఉన్న సెయింట్ మైఖేల్ గర్ల్స్ హాస్టల్లో ఉంటోంది. ఆ విద్యార్థిని జనవరి 9న విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో .. హాస్టల్ను శుభ్రం చేయాలని, మెయింటెనెన్స్ పనులు చేయాలని హాస్టల్ వార్డెన్ తనను వేధించిందని తన డైయింగ్ డిక్లరేషన్ వీడియోలో బాలిక ఆరోపించింది. ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 19న మృతిచెందింది.
మరోవైపు .. .. పాఠశాలలో బలవంతంగా మతమార్పిడి చేశారనే ఒత్తిడి వల్లనే ఆమె మృతిచెందినట్లు మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే తమ పాఠశాలలో అలాంటి మతమార్పిడి ఘటనలు జరగలేదని, ఏ విద్యార్థిపైనా ఒత్తిడి చేయలేదని స్కూల్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది యాజమాన్యం.
హాస్టల్ వార్డెన్ను జువైనల్ చట్టం కింద ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలతో పాటు అరెస్టు చేశారు. అయితే ఈ కేసును జనవరి 31న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తును అప్పగించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. కానీ.. మద్రాసు హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తమిళనాడు డీజీపీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. దాఖలు చేసిన అప్పీల్పై న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బేల త్రివేదిలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
