ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టును తెలంగాణ వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఆప్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
దేశ వ్యాప్తంగా సంచలన రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆదివారం నాడు అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాను సీబీఐ (CBI) అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు.. సిసోడియాను దాదాపు 8 గంటలపాటు సీబీఐ విచారించింది. అనంతరం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసింది. సోమవారం ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా.. సిసోడియా అరెస్ట్ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు సీబీఐ అందించింది. ఈ అరెస్ట్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అలాగే.. సిసోడియా నివాసంతోపాటు సీబీఐ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.
కాగా.. ఢిల్లీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీవ్రంగా ఖండిస్తోంది. ఈ అరెస్టు పై తెలంగాణ వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు స్పందించారు.
ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్య అని మండిపడ్డారు. ఆమ్ ఆద్మీపార్టీని రాజకీయంగా ఎదుర్కోలేకనే.. ఆ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ నాయకత్వాన్ని ఇరికించే ప్రయత్నం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నందని అన్నారు.
ఇటీవల ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘెరంగా దెబ్బతిన్న బీజేపీ కేవలం కక్షసాధింపు చర్యగా ఆప్ నేతలపై అభియోగాలు మోపి అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అర్థబలాన్ని, అంగబలాన్ని ఉపయోగించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నం చేసిందనీ, కార్పొరేషన్లో మేయర్ ఎన్నిక సందర్భంగా బీజేపీ ఎంత నీచంగా వ్యవహరించిందో.. దేశమంతా చూసిందని అన్నారు. ఈ ఎన్నికల వ్యవహరంపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకుందంటే.. ఎలాంటి పరిస్థితి, పరిణామాలు జరిగాయో అర్థమవుతోందని అన్నారు.
ఆప్ ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నదనీ, రాజకీయంగా ఆమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కోలేక సీబీఐని అడ్డంపెట్టుకొని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ను లిక్కర్ స్కాంలో ఇరికించి, అరెస్టు చేశారని ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థకు కళంకం తెచ్చేలా బీజేపీ వ్యవహరిస్తున్నదనీ, దేశంలో ఈడీ, సీబీఐ, ఐటీలతో ప్రత్యర్ధి, ప్రతిపక్ష పార్టీలను బీజేపీ బెదిరిస్తోందని అన్నారు. ఇక నుంచి బీజేపీ ఆటలు సాగవనీ, ప్రజలు ఆపార్టీకి బుద్దిచెప్పే రోజులు అతిత్వరలోనే రాబోతున్నాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
