తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం జార్ఖండ్కు వెళ్లనున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న కేసీఆర్.. నేడు అక్కడి నుంచే జార్ఖండ్ రాజధాని రాంచీకి చేరుకున్నారు. అయితే సీఎం కేసీఆర్ జార్ఖండ్ వెళ్తుంది రాజకీయాల కోసం మాత్రం కాదు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) శుక్రవారం జార్ఖండ్కు వెళ్లనున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న కేసీఆర్.. నేడు అక్కడి నుంచే జార్ఖండ్ (Jharkhand) రాజధాని రాంచీకి చేరుకున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు గల్వాన్ లోయ జరిగిన ఘర్షణలో అమర వీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో(Hemant Soren) కలిసి గల్వాన్ లోయ ఘర్షణలో అమరలైన ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నారు.
గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. వారిలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నారు. అయితే సంతోష్ బాబు కుటుంబంతో పాటు, మిగిలిన 19 మంది అమర జవాన్ల కుటుంబాలకు కేసీఆర్ సాయం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సంతోష్ బాబు కుటుంబానికి రూ. 5 కోట్ల నగదుతోపాటు నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్–1 స్థాయి ఉద్యోగం.. మిగతా 19 మంది అమర జవాన్ల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల చొప్పున అందజేయనున్నట్టుగా చెప్పారు. గతంలో సంతోష్ బాబు నివాసానికి వెళ్లిన కేసీఆర్ ప్రకటించిన సాయం అందజేశారు. అలాగే సంతోష్ బాబు భార్య సంతోషికి ఉద్యోగ నియమాక ప్రతాలు అందజేశారు.
ఇప్పుడు మిగతా 19 మంది అమర జవాన్లను కుటుంబాలకు కూడా గతంలో ప్రకటించిన విధంగా.. రూ. 10 లక్షల చొప్పున సాయం అందజేసేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే నేడు జార్ఖండ్ వెళ్లి.. ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు పరిహారం అందజేయనున్నారు. ఇక, పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున ఆయా రాష్ట్రాలకు చెందిన అమర జవాన్ల కుటుంబాలకు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఆర్థిక సహాయం అందేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటారని తెలంగాణ సీఎంవో వర్గాలు తెలిపాయి.
ఇక, ఈ పర్యటన సందర్భంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు విషయంపై హేమంత్ సోరెన్తో కేసీఆర్ చర్చిస్తారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. సొరెన్తో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కేసీఆర్ హైదరాబాద్కు బయలుదేరుతారు.
