అన్నదమ్ముల ఆధిపత్య పోరు: లాలు ప్రసాద్ను నిర్బంధించారని తమ్ముడిపై అన్న ఆరోపణలు
ఆర్జేడీలో అన్నదమ్ముల ఆధిపత్య పోరు తీవ్రతరమైంది. నీవా.. నేనా అన్నట్టుగా మాటలు దూసుకుంటున్నారు. తాజాగా తండ్రి లాలు ప్రసాద్ యాదవ్నే సాకుగా చేసుకుని తేజ్ ప్రతాప్ యాదవ్ తమ్ముడు తేజస్వీ యాదవ్పై ఆరోపణలు సంధించారు. తేజస్వీ యాదవ్ ప్రస్తుతం బిహార్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
పాట్నా: బిహార్ ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీలో అన్నదమ్మలు ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. లాలు ప్రసాద్ యాదవ్ తనయులు ఇద్దరు ఒకరిపై ఒకరు వాగ్యుద్ధం చేసుకుంటున్నారు. తాజాగా, తండ్రి లాలు ప్రసాద్నే సాకుగా తీసుకుని తేజ్ ప్రతాప్ యాదవ్.. తమ్ముడు తేజస్వీ యాదవ్పై ఆరోపణలు చేశారు. ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ జైలు నుంచి ఏడాది క్రితమే విడుదలయ్యారని, కానీ, ఆయనను తమ్ముడు తేజస్వీ యాదవ్ నిర్బంధించాడని తేజ్ ప్రతాప్ యాదవ్ పేరు ప్రస్తావించకుండా ఆరోపణలు చేశారు. దీనిపై తేజస్వీ సూటిగా స్పందించారు.
‘మా నాన్న ఆరోగ్యం బాగాలేదు. రాష్ట్రీయ జనతా దళ్ పార్టీకి చీఫ్ కావాలనే నలుగురైదుగురు పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారు. మా నాన్న జైలు నుంచి ఏడాది క్రితమే విడులయ్యాడు. కానీ, ఆయనను నిర్బంధించారు’ అంటూ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు తేజస్వీ యాదవ్ స్పందిస్తూ ‘బిహార్ రాష్ట్రానికి లాలూజీ దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఒకానొక దశలో ఎల్కే అడ్వాణీని కటకటాల వెనక్కి పంపారు. అంతటి పెద్ద మనిషి స్టేచర్, స్థాయితో ఇలాంటి వ్యాఖ్యలు మ్యాచ్ కావు’ అని అన్నారు.
ఆర్జేడీలో ఈ ఇద్దరు అన్నాదమ్ముల మధ్య వైరం వేడెక్కింది. ఒకరిపై ఒకరు మాటలతో కత్తులు దూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే పార్టీలో ఉన్నవారంతా కచ్చితంగా పార్టీ క్రమశిక్షణను పాటించాల్సిందేనని తేజస్వీ యాదవ్ అన్నారు. ఇది తేజ్ ప్రతాప్ యాదవ్కు వార్నింగ్ ఇచ్చినట్టుగానే చాలా మంది చూశారు. కాగా, పార్టీలో తనకు విలువ లేకుండా చేస్తున్నారన భావనతో తేజ్ ప్రతాప్ యాదవ్ ఆర్జేడీ విద్యార్థి విభాగానికి సమాంతరంగా మరో జనశక్తి పరిషద్ను ఏర్పాటు చేశారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ బలమైన నాయకుడిగా ఎదుగుతున్నవాడిగా అందరికీ కనిపించారు. బీజేపీ నేతలందరినీ ఒంటరిగా ఎదుర్కొని గట్టి పోటీ ఇచ్చారు. ఆయన సభలకు ప్రజలు వెల్లువలా కదలివచ్చారు. మొదటి నుంచి లాలు ప్రసాద్ యాదవ్ కూడా పార్టీ బాధ్యతలు నిర్వహించే సత్తా తేజస్వీ యాదవ్కే ఉన్నదని భావిస్తూ వచ్చారు.