Tejashwi Yadav: 'మా ఇంట్లోనే సీబీఐ-ఈడీలు తమ కార్యాలయాలను పెట్టుకోవచ్చు'
Tejashwi Yadav: బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ టార్గెట్ చేస్తూ.. తన ఇంట్లోనే ఈడీ-సీబీఐ కార్యాలయాలను ప్రారంభించుకోవచ్చని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థల పనితీరుపై ప్రశ్నలు సంధించారు.
Tejashwi Yadav: బీహార్ లో రాజకీయ సమీకరణాలు ఎవరూ ఊహించిన విధంగా శరవేగంగా మారిపోయాయి. తాజాగా నూతన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) కేంద్రంపై విమర్శాస్త్రాలు సంధించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంటర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పనితీరుపై సెటైర్లు వేశారు. తన ఇంట్లోనే ఆయా సంస్థలు కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని సంచలన ఆరోపణలు చేశారు.
జేడీయూ-ఆర్ జేడీయూల పొత్తుపై ఆయన మాట్లాడుతూ.. ఈసారి మనస్ఫూర్తిగా తాము నితీష్ కుమార్ తో పొత్తు పెట్టుకున్నామన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈడీ-సీబీఐ దుర్వినియోగం చేస్తూ.. ఆ సంస్థలతో బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. అలాంటి బెదిరింపులకు భయపడే రోజు పోయిందనీ, అవసరం అనుకుంటే.. ED-CBI లు తన ఇంటికి రావచ్చుననీ, వారి ఆఫీసులు తన ఇంట్లోనే తెరుచుకోవచ్చని ఆహ్వానించాడు.
రాజకీయ ప్రత్యర్థులపై బీజేపీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందన్నారు. దీని నుండి బీజేపీకి శాంతి కలగకపోతే.. తాను సహాయం చేయలేననీ, తాను ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన మొదటి పర్యాయం కూడా ఈ ఏజెన్సీలకు తాను భయపడలేదనీ, బీహార్ ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడుతూనే ఉన్నాననీ, ఇప్పుడు కూడా తాను అసలు భయపడనని చెప్పుకొచ్చారు. తనపై నమోదైన కేసు గురించి మాట్లాడుతూ.. తాను ఏదైనా నేరం చేసి ఉంటే.. ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
2017లో విపక్ష నేతగా పని చేస్తున్నప్పటి నుంచి తన పరిణతి పెరిగిందని తేజస్వి యాదవ్ అన్నారు. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి తాను సారధ్యం వహించానని, తాను పిల్లవాడిగా ఉన్న తనపై కేసు నమోదు చేశారని, ఆ ఆరోపణలు నిజమైతే.. తాను ఏదైనా నేరానికి పాల్పడితే.. ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. 2017లో తేజస్వి యాదవ్పై హవాలా లావాదేవీల కేసు నమోదైన సంగతి తెలిసిందే.