దారుణం.. రెండో ఎక్కాం చెప్పలేదని విద్యార్థి చేతిపై మెషిన్తో డ్రిల్ చేసిన ఉపాధ్యాయుడు
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్జిల్లా ప్రేమ్ నగర్లోని అప్పర్ ప్రైమరీ మోడల్ స్కూల్లో ఐదో తరగతి విద్యార్థిపై ఓ ఉపాధ్యాయుడు దారుణంగా వ్యవహరించాడు. రెండో ఎక్కాం చెప్పలేదని విద్యార్థి చేతులపై డ్రిల్ మిషన్తో గాయపరిచారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలలో ఆందోళన చేపట్టారు. నిందిత ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ విద్యార్థి పట్ల ఉపాధ్యాయుడు విచక్షణ రహితంగా ప్రవర్తించాడు. ఎక్కాలు చెప్పలేదని అత్యంత దారుణంగా శిక్షించాడు. ఏకంగా హ్యాండ్ డ్రిల్ మిషన్ను ఉపయోగించి విద్యార్థి చేతిపై డ్రిల్ చేశాడు. ఈ ఘటన కాన్పూర్ జిల్లా ప్రేమ్ నగర్ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. కాన్పూర్ జిల్లా ప్రేమ్ నగర్ ప్రాంతంలోని అప్పర్ ప్రైమరీ మోడల్ స్కూల్ లో సిసమావు నివాసి శివకుమార్, సవిత దంపతుల కుమారుడు వివాన్ ఐదవ తరగతి చదువుతున్నాడు. UNICEF చే ఎంపిక చేయబడిన ఈ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ వంటి పనుల్లో శిక్షణను అందిస్తున్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు నడిచే ఈ పాఠశాలలో సంస్థ తరపున అనూజ్ పాండే అనే ఉపాధ్యాయుడు వారికి శిక్షణ ఇచ్చేవారు. అయితే.. అతడు ఇటీవల వేరే స్కూల్కి బదిలీ అయ్యాడు. కానీ.. గురువారం నాడు మళ్లీ అదే స్కూల్ కు వచ్చాడు. అతను లైబ్రరీ రూమ్ లో బుక్ షెల్ఫ్లను అమర్చడానికి డ్రిల్ మిషన్తో రంధ్రాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో వివాన్ అక్కడికి చేరుకున్నారు.
ఈ విషయాన్ని గమనించిన ఉపాధ్యాయుడు అనుజ్ పాండే అతడిని మందలించాడు. రెండో ఎక్కం చెప్పమని అడిగాడు. అయితే విద్యార్థి వివాన్ రెండో ఎక్కం చెప్పలేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వివాన్ ఎడమ చేతిపై డ్రిల్ మిషన్ పై డ్రిల్ చేయడం ప్రారంభించాడు. పక్కనే ఉన్న తోటి విద్యార్థి వెంటనే డ్రిల్ మిషన్ ప్లగ్ని తొలగించాడు. అప్పటికే విద్యార్థి వివాన్ అర చేతిలో డ్రిల్ దిగడంతో గాయపడ్డాడు. తన స్నేహితుడు స్పందించకపోతే.. చేతిలో మరింత లోతుగా ఆ డ్రిల్ పడేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఈ ఘటన జరిగిన రోజున పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుభాష్చంద్ర.. బీఎల్ఓ డ్యూటీ కారణంగా పాఠశాలకు రాలేదు. ఆయన స్థానంలో టీచర్ అల్కా త్రిపాఠి బాధ్యతలు చేపట్టారు. విద్యార్థి ఏడుపును విన్న ఉపాధ్యాయుడు విషయంపై ఆరా తీశారు. విద్యార్థి చేతికి గాయం కావడంతో విద్యార్థికి చికిత్స అందించారు. విద్యార్థికి ధనుర్వాతం పరీక్ష చేయకుండా పంపించారని విద్యార్తి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఒక్కసారిగా కలకలం రేగడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే బీఎస్ఏ సూర్జిత్కుమార్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. ఇన్ స్ట్రక్టర్ ను స్కూల్ నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. దీనితో పాటు ఇతర చర్యలు కూడా తీసుకోనున్నారు.ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో సదరు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.