విహారంలో విషాదం.. స్టూడెంట్ ను కాపాడి.. నదిలో కొట్టుకుపోయిన టీచర్.. చివరికి విగతజీవిగా...
వనభోజనాలకు వెళ్లి.. నదిలో ఈతకు వెళ్లాడో విద్యార్థి.. నది ప్రవాహానికి కొట్టుకుపోతున్న అతడిని కాపాడి.. తాను ప్రాణాలు కోల్పోయాడో టీచర్.
ఒడిశా : ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థి నదిలో కొట్టుకుపోతుంటే.. కాపాడి ఒడ్డుకు చేర్చాడో ఉపాధ్యాయుడు.. ఆ తరువాత ప్రవాహ వేగానికి అతను నదిలో గల్లంతయ్యాడు. చివరికి మృతి చెందాడు. బుధవారం ఈ విషాద ఘటన జరిగింది. ఒడిశాలోని కేంద్రపడ జిల్లా మహాకాళపడా ప్రాంతంలో ఈ ఘటన కేంద్రబిందువు. అక్కడి ఓ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ వనభోజనాల కోసం నయాగడ్ జిల్లాలోని కంటిలోని పర్యాటక ప్రాంతానికి వెళ్లారు.
అక్కడ నదిలోని నీటిని చూసిన విద్యార్థులు స్నానం చేయాలనుకున్నారు. దీనికోసం మహానదిలోకి కొంతమంది విద్యార్థులు దిగారు. అందులో ఒకరు నది నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్నాడు. ఇది గమనించిన టీచర్ సరోజ్ దాస్ (35) అతడిని కాపాడేందుకు నదిలోకి దిగాడు. కొట్టుకుపోతున్న విద్యార్థిని కాపాడాడు. ఒడ్డుకు లాగాడు. ఇంతలో ఏమైందో ఏమో కానీ సరోజ్ దాస్ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అది గమనించిన మిగతావారు షాక్ అయ్యారు. రెండు గంటలపాటు వెతికిన తరువాత టీచర్ ఆచూకీ దొరికింది. వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే సరోజ్ దాస్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.