పశ్చిమ బెంగాల్లో ఓ ముస్లిం విద్యార్థిని చెంపపై నుంచి టీచర్ కొట్టినందుకు స్కూల్లో రచ్చ రచ్చ జరిగింది. విద్యార్థిని పేరెంట్స్, ఇతరులు హెచ్ఎం ఆఫీసు ముందు ధర్నాకు దిగారు. ఆ తర్వాత ఆఫీసులోకి చొరబడి ఆ మహిళా టీచర్పై దాడి చేశారు. ఆమె బట్టలు చింపేశారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఓ దారుణం జరిగింది. స్కూల్లో ఓ విద్యార్థినికి క్రమశిక్షణ నేర్పుతున్న తీరు తనకే ప్రమాదాన్ని తెస్తుందని ఆ ఉపాద్యాయురాలికి తెలియదు. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు, ఇతరులు స్కూల్లోకి వచ్చి నానా హంగామా చేశారు. ప్రధాన ఉపాధ్యాయుల కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ఆఫీసు రూమ్లోకి చొరబడి మరీ ఆ మహిళా టీచర్పై దాడి చేశారు. ఆమె బట్టలు చినిగిపోయేలా దాడి చేశారు. ఈ ఘటన దక్షిణ దినాజ్పూర్లో చోటుచేసుకుంది.
దక్షిణ దినాజ్పూర్ జిల్లా హిలి పోలీసు స్టేషన్ పరిధిలోని త్రిమోహిని ప్రతాప్ చంద్ర హై స్కూల్లో ఓ గురువారం ఎందుకు తరగతులు హాజరు కాలేదని టీచర్ ఆగ్రహిస్తూ ముస్లిం అమ్మాయి చెంప చెళ్లుమనిపించింది. శుక్రవారం ఈ ఘటన జరిగింది. దీంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఒక మూకగా ఏర్పడి టీచర్పై దారుణంగా దాడి చేయడమే కాదు.. అసభ్యకరంగా దుర్భాషలాడారు. బూతులు తిట్టారు.
ఈ సమాచారం అందుకోగానే పోలీసులు స్పాట్కు వెళ్లారు. ఉపాధ్యాయులకు రక్షణ కల్పిస్తామని అక్కడ హామీ ఇచ్చారు. టీచర్పై దాడికి దిగిన నలుగురు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. ఫిర్యాదు నమోదైన గంటల వ్యవధిలోనే ఈ అరెస్టులు జరిగాయి.
బీజేపీ ఎంపీ, స్టేట్ ప్రెసిడెంట్ సుకంత మజుందార్ ఈ ఘటనపై రియాక్ట్ కావడంతో ఇది రాజకీయ రూపు పులుముకుంది. టీచర్పై దాడికి దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. టీచర్పై దాడికి సంబంధించిన వీడియోను బీజేపీ యువజన శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తరుణ్ జ్యోతి తివారీ ట్విట్టర్లో షేర్ చేశారు.
ఈ ఘటన స్థానికుల్లో కలకలం రేపింది. టీచర్కు మద్దతుగా పలువురు శనివారం నిరసనలు చేశారు. తాను కూడా ఒకప్పుడు టీచరర్నే అని, విద్యార్థులకు డిసిప్లీన్ నేర్పామని సుకంత మజుందార్ అన్నారు. ఆ విద్యార్థిని చెవిని ఆ టీచర్ పట్టుకుని భయం చెబుతుండగా విద్యార్థిని హిజబ్ జారి కిందపడిపోయిందని, ఇక్కడ వివాదం అంతా ఇదేనని పేర్కొన్నారు. తాము ధర్నాలు చేయడం మూలంగానే పోలీసులు వారిని అరెస్టు చేశారని వివరించారు.
