ఏపీ డిమాండ్లపై గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీల ధర్నా
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ధర్నా నిర్వహించారు. ఏపీకి న్యాయం చేయాలని టీడీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు.
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ధర్నా నిర్వహించారు. ఏపీకి న్యాయం చేయాలని టీడీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు.
పార్లమెంట్ ప్రారంభానికి ముందుగానే టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. ఏపీకి న్యాయం చేయకుండా అవిశ్వాసం సందర్భంగా మోడీ అన్ని అబద్దాలు మాట్లాడారని టీడీపీ ఎంపీలు ఆరోపణలు గుప్పించారు.
చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మరోసారి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య వేషధారణలో ఎంపీ శివప్రసాద్ పార్లమెంట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అన్నమయ్య కీర్తనల్లోని కొండల్లో నెలకొన్న కోనేటీ రాయడు వాడు... అనే కీర్తనకు పేరడీని మోడీని విమర్శిస్తూ ఎంపీ శివప్రసాద్ పాడి విన్పించారు.
ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయకుండా కేంద్రం మోసం చేసిందని ఆ కీర్తనలో ఎంపీ శివప్రసాద్ ఆరోపించారు. ఏపీ రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని టీడీపీ ఎంపీలు ప్రకటించారు.