తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో నడుస్తుండగా కాలు జారి కిందపడిపోయారు. ఈ ఘటనకు సంబంధించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో జరిగిన హైబ్రిడ్ రాకెట్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న తమిళిసై సౌందర్రాజన్.. నడుస్తుండగా కాలు జారి కింద పడిపోయారు. దీంతో వెంటనే అక్కడున్న అధికారులు, ఇతరులు.. వెంటనే ఆమెను పైకి లేపారు. ఈ ఘటనలో గవర్నర్ తమిళిసైకి ఎటువంటి గాయాలు కాలేదు. నడుస్తుండగా కాలు స్లిప్ కావడంతో ఆమె పడిపోయారు. అయితే తమిళిసౌ సౌందర్ రాజన్ నడుస్తుండగా.. కిందపడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పలు మీడియా సంస్థలు కూడా ఈ ఘటనను రిపోర్ట్ చేశాయి.
అయితే ఈ ఘటనపై స్పందించిన తమిళిసై.. కష్టపడి పనిచేస్తే వార్తలో రాదని.. ఇలా పడిపోతే టీవీల్లో వార్త కనిపిస్తుందని సరదాగా పేర్కొన్నారు. ‘‘కింద పడటం మామూలే. కానీ అది పెద్ద వార్తగా ప్రచురించడంతో చాలా మంది నా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నేను పని చేస్తే టీవీల్లో రాదు.. పడిపోతే టీవీ తెరపై పెద్ద వార్త’’ అని గవర్నర్ తమిళిసై అన్నారు.
